India vs Australia: భార‌త్‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య అక్టోబ‌ర్ 19న వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. దీంతో టీమిండియా జ‌ట్టు ఎంపిక‌కు సంబంధించి అంద‌రి దృష్టి ప‌డింది. 

రోహిత్ శర్మ కెప్టెన్సీపై అప్‌డేట్

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ అక్టోబర్ 19న పెర్త్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టును ఎంచుకునే ప్రక్రియ త్వరలోనే జరుగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి రాకతో జట్టు కూర్పుపై ఆసక్తి పెరిగింది.

రోహిత్, కోహ్లీ రీ ఎంట్రీతో పెరిగిన అంచనాలు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత ఇప్పుడు వన్డేలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఏడున్నర నెలల విరామం తర్వాత ఇద్దరూ బలమైన ప్రదర్శనలతో తిరిగి రాణించారు. కోహ్లీ పాకిస్తాన్‌పై శతకం సాధించగా, ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో జట్టుకు అత్యధిక పరుగులు చేశాడు. రోహిత్ న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని అందించాడు.

రోహిత్ కెప్టెన్సీ కొనసాగనుందా?

బీసీసీఐ వర్గాల ప్రకారం, రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలనే ఉద్దేశం లేదు. అతని నాయకత్వంలో భారత్‌కు అద్భుతమైన విజయాలు లభించాయి. కాబట్టి, అతను స్వయంగా తప్పుకుంటే తప్ప కెప్టెన్సీలో మార్పు జరగదని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి.?

ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ గత సంవత్సరం నుంచి అన్ని ఫార్మాట్లలో నిరంతరంగా ఆడుతున్నాడు. ఫిట్‌నెస్, పనిభారం దృష్ట్యా అతనికి ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వన్డే లేదా టీ20 సిరీస్‌లో కొంతకాలం విరామం ఇవ్వడం ద్వారా అతని ఫార్మ్‌–ఫిట్‌నెస్‌ను నిలుపుకోవాలని భావిస్తున్నారు.

గాయాల సమస్యతో జట్టుకు సవాలు

ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ లేని లోటు భారత్‌కు పెద్ద సవాలు. హార్దిక్ ఇంకా క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకుంటుండగా, పంత్ తన పాత గాయం నుంచి పూర్తిగా బయటపడలేదు. ఈ కారణంగా మిడిల్ ఆర్డ‌ర్‌లో ఫినిషర్ పాత్రను భర్తీ చేసే బాధ్యత సెలెక్టర్లపై పడనుంది.

ప్ర‌మోష‌న‌ల్ వీడియోలో సిగ్న‌ల్

జియో హాట్‌స్టార్ విడుదల చేసిన వన్డే సిరీస్ ప్రమోషనల్ వీడియోలో రోహిత్, కోహ్లీ ఫొటోలు క‌నిపించ‌డం గమనార్హం. ఇది ఇద్దరూ ఆస్ట్రేలియా పర్యటనలో ఆడబోతున్నారనే స్పష్టతనిచ్చింది. అదే సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టే అవకాశాలను బలపరిచింది.