తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... 167.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి విసిగించిన ఆసీస్ బ్యాటర్లు... 6 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్..
అహ్మదాబాద్ టెస్టులో ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. 167.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజాని 409 పరుగుల వద్దే అవుటైనా నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ కలిసి 9వ వికెట్కి 70 పరుగులు జోడించి భారత బౌలర్లను విసిగించారు.
టాడ్ ముర్ఫీ 61 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు, నాథన్ లియాన్ 96 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు. రవిచంద్రన్ అశ్విన్కి 6 వికెట్లు దక్కగా షమీ రెండు, జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు..
ఈ మ్యాచ్లో 31 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ షమీ, తన టెస్టు కెరీర్లోనే సుదీర్ఘ స్పెల్ నమోదు చేశాడు. అశ్విన్ 47.2 ఓవర్లు వేసి 15 మెయిడిన్లతో 6 వికెట్లు తీశాడు.
తొలి రోజు ఆఖరి సెషన్లో, రెండో రోజు తొలి సెషన్లో వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు, ఎట్టకేలకు రెండో సెషన్లో వికెట్లు రాబట్టగలిగారు. ఐదో వికెట్కి 208 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కామెరూన్ గ్రీన్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...
170 బంతుల్లో 18 ఫోర్లతో 114 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో శ్రీకర్ భరత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇండియాలో ఆస్ట్రేలియాకి ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 1979-80 పర్యటనలో ఆస్ట్రేలియా ప్లేయర్ హ్యూజ్- ఆలెన్ బోర్డర్ కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టాప్లో ఉన్నారు. ఆ రికార్డును 14 పరుగుల తేడాతో మిస్ చేసుకుంది కామెరూన్ గ్రీన్ - ఉస్మాన్ ఖవాజా జోడి...
కామెరూన్ గ్రీన్ అవుటైన తర్వాత నాలుగో బంతికి అలెక్స్ క్యారీని డకౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. నాలుగు బంతులాడిన అలెక్స్ క్యారీ, భారీ షాట్ ఆడేందుకు బంతిని గాల్లోకి లేపి అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత 6 ఇన్నింగ్స్లో అశ్విన్ బౌలింగ్లో అలెక్స్ క్యారీ అవుట్ కావడం ఇది ఐదోసారి...
ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన తర్వాత కూడా అశ్విన్ని తప్పించి, అతని ప్లేస్లో మహ్మద్ షమీని బౌలింగ్కి దించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మరో ఎండ్లో బౌలింగ్కి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్ వికెట్ పడగొట్టాడు. 20 బంతుల్లో 6 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్, అశ్విన్ బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో ఉస్మాన్ ఖవాజా క్రీజులో కుదురుకుపోయాడు. గత 12 ఏళ్లలో ఇండియాలో 400లకు పైగా బంతులు ఫేస్ చేసిన ప్రత్యర్థి బ్యాటర్గా నిలిచాడు ఉస్మాన్ ఖవాజా. ఇంతకుముందు చివరిగా 2010 ఫిబ్రవరిలో నాగ్పూర్లో జరిగిన టెస్టులో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లా 473 బంతులాడి 253 పరుగులు చేశాడు. ఆ తర్వాత 400లకు పైగా బంతులు ఎదుర్కొన్న తొలి బ్యాటర్ ఉస్మాన్ ఖవాజానే...
422 బంతుల్లో 21 ఫోర్లతో 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమిండియాకి ఫలితం కలిసి వచ్చింది. ఆ తర్వాత టెయిలెండర్లు నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ కలిసి 19.2 ఓవర్ల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడ్డారు. ఈ ఇద్దరినీ అశ్విన్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది...