ఆసీస్పై విజయంతో పాక్ రికార్డులను బద్దలుకొట్టిన టీమిండియా..
Team India: ఉప్పల్ వేదికగా ముగిసిన ఇండియా-ఆసీస్ మూడో టీ20లో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో విజయం ద్వారా పాక్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలుకొట్టింది.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఓటమి తర్వాత లోపాలను సమీక్షించుకుని విజయాల బాట పట్టిన టీమిండియా తాజాగా మరో సిరీస్ ను పట్టేసింది. న్యూజిలాండ్ సిరీస్ తో మొదలుపెట్టిన భారత్.. నిన్న ముగిసిన ఆసీస్ సిరీస్ వరకూ స్వదేశంలో ఒక్కదాంట్లో కూడా ఓడలేదు. ఆసీస్ ను 2-1తో ఓడించడం ద్వారా రోహిత్ సేన అరుదైన రికార్డును అందుకుంది. ఒక క్యాలెండర్ ఈయర్ లో అత్యధిక టీ20 మ్యాచ్ లు గెలిచిన జట్టుగా పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసి కొత్త చరిత్రను సృష్టించింది.
హైదరాబాద్ లో టీమిండియా సాధించిన విజయం (టీ20లలో) 2022లో 21వది. తద్వారా గతేడాది పాకిస్తాన్ ఇదే ఫార్మాట్ లో సాధించిన అత్యధిక విజయాల (20) రికార్డు చెరిగిపోయింది.
ఈ జాబితాను పరిశీలిస్తే..
- 21 (టీమిండియా- 2022)
- 20 ( పాకిస్తాన్ - 2021)
- 17 (పాకిస్తాన్ - 2018)
- 16 (ఉగాండా - 2016)
- 15 ( సౌతాఫ్రికా - 2021)
ఈ రికార్డుతో పాటు ఉప్పల్ లో మరికొన్ని రికార్డులు కూడా నమోదుయ్యాయి. టీ20లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని.. 42 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మకు ఉప్పల్ లో విజయం టీ20 కెప్టెన్ గా 33వది. 32 విజయాలతో ఉన్న కోహ్లీ రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు.
అంతేగాక 2021 నుంచి భారత్.. ఛేదన (రెండోసారి బ్యాటింగ్) కు దిగిన 14 మ్యాచ్ లలో 13 సార్లు నెగ్గడం విశేషం. ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోయింది. ఉప్పల్ లో నిన్న రాత్రి ఛేదన 13వది కావడం విశేషం.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54), డేనియల్ సామ్స్ (28) ధాటిగా ఆడారు. 187 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ 19.5 ఒవర్లలో పూర్తి చేసింది. భారత జట్టు తరఫున సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63), హార్ధిక్ పాండ్యా (25 నాటౌట్) రాణించారు.