IND vs WI: అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఇండియా వర్సెస్ వెస్టిండిస్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు టీమిండియా ఆధిప‌త్యాన్ని క‌న‌బ‌రిచింది. ఓ వైపు బౌలింగ్, మ‌రోవైపు బ్యాటింగ్‌తో రాణించారు. వివ‌రాల్లోకి వెళితే.. 

స్థిరంగా టీమిండియా ఇన్నింగ్స్ 

అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న భారత్‌ – వెస్టిండీస్‌ తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే నాటికి భారత్‌ బలమైన స్థితిలో నిలిచింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (36, 7 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (7) ఔటవ్వగా, కేఎల్‌ రాహుల్‌ (53*) అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు. అతడికి శుభ్‌మన్‌ గిల్‌ (18*) తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకంటే 41 పరుగులు వెనుకబడి ఉంది. వెస్టిండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ తీశారు. ఆరంభంలో కొంత ఒత్తిడి తెచ్చినప్పటికీ భారత బ్యాటర్లు రాణించి స్కోరును ముందుకు తీసుకెళ్లారు.

విండీస్‌ ఇన్నింగ్స్ పతనం

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ కేవలం 162 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత బౌలర్ల తాకిడిని ఎదుర్కోలేక ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ చేరారు. సిరాజ్‌ (14 ఓవర్లు, 3 మెయిడెన్లు, 40 పరుగులు, 4 వికెట్లు), బుమ్రా (14 ఓవర్లు, 3 మెయిడెన్లు, 42 పరుగులు, 3 వికెట్లు), కుల్దీప్‌ యాదవ్‌ (6.1 ఓవర్లు, 25 పరుగులు, 2 వికెట్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (3 ఓవర్లు, 9 పరుగులు, 1 వికెట్‌) దాడికి కుప్పకూలింది.

విండీస్‌ బ్యాటర్ల విఫలం

వెస్టిండీస్‌ తరఫున ఏడో నంబర్‌లో ఆడిన జస్టిన్‌ గ్రీవ్స్‌ (32) మాత్రమే కాస్త మెరుగ్గా ఆడాడు. కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (24), షాయ్‌ హోప్‌ (26), బ్రాండన్‌ కింగ్‌ (13), అలిక్‌ అథనాజ్‌ (12), ఖారీ పియెర్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లను చేరుకోగలిగారు. మిగతా ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఓపెనర్‌ తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ డకౌట్ అవ్వగా, జాన్‌ క్యాంప్‌బెల్‌ (8), జోమెల్‌ వార్రికన్‌ (8), జోహన్‌ లేన్‌ (1) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

భారత వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టి బౌలర్లకు సహకరించాడు. దీంతో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ త్వరగా ముగిసింది. మొత్తం మీద తొలి రోజు ఆటలో భారత బౌలర్ల ఆధిపత్యం, రాహుల్‌ బ్యాటింగ్‌ మెరుపులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.