IND vs SA: గువహతిలో ముగిస్తారా..? మధ్యప్రదేశ్కు మోసుకెళ్తారా..? రెండో టీ20లో టాస్ ఓడిన టీమిండియా
IND vs SA T20I: భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన నేడు గువహతి (అసోం)లో ఉన్న బర్సపర స్టేడియం వేదికగా రెండో టీ20 ఆడుతున్నది. ఇప్పటికే సిరీస్ లో భారత్.. 1-0 ఆధిక్యంలో ఉంది.
టీ20 ప్రపంచకప్ కు ముందు భారత్ ఆడబోతున్న చివరి టీ20 సిరీస్ ను కూడా విజయంతో ముగించాలని రోహిత్ సేన భావిస్తున్నది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తిరువనంతపురంలో ముగిసిన తొలి టీ20 నెగ్గిన భారత్.. నేడు గువహతిలో జరుగుతున్న రెండో మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు గువహతిలో జరుగుతున్న రెంటో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. తొలుత బ్యాటింగ్ కు రానుంది. ఈ మ్యాచ్ లో ఫలితం భారత్ కు అనుకూలంగా రాకుంటే ఈ నెల 4న ఇండోర్ (మధ్యప్రదేశ్) లో తుది పోరు జరుగుతుంది.
గత మ్యాచ్ లో ఆడలేకపోయిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టుతో చేరగా నేటి మ్యాచ్ లో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. భారత్.. తొలి మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నది. దక్షిణాఫ్రికా మాత్రం స్పిన్నర్ షంషి స్థానంలో లుంగి ఎంగిడితో బరిలోకి దిగుతున్నది.
తుది జట్లు :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్దీప్ సింగ్
దక్షిణాఫ్రికా : టెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రూసో, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, కగిసొ రబాడా, ఆన్రిచ్ నోర్త్జ్, లుంగి ఎంగిడి