Ind Vs SA: మీ సేవలకో దండం.. ఇప్పటికైనా దిగిపోండయ్యా.. టీమిండియా సీనియర్లపై దారుణ ట్రోలింగ్
Fans roast Ajinkya Rahane And Cheteshwar Pujara: టీమిండియా మేనేజ్మెంట్ ఈ వెటరన్స్ కు అవకాశాలిస్తున్నా ఆ ఇద్దరుమాత్రం ప్రతిసారి తక్కువ రన్స్ కే పెవిలియన్ కు చేరుతున్నారు. దీంతో ఫ్యాన్స్ వాళ్లపై ఫైర్ అవుతున్నారు.
ఒకప్పుడు భారత బ్యాటింగ్ కు మిడిలార్డర్ లో మూలస్తంభాలుగా నిలిచిన ఆ ఇద్దరు ఆటగాళ్లు.. గత కొంతకాలంగా దారుణాతి దారుణంగా విఫలమవుతన్నారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా గత పది, పదిహేను టెస్టులకు వాళ్ల మీద నమ్మకముంచిన టీమిండియా మేనేజ్మెంట్ ఈ వెటరన్స్ కు అవకాశాలిస్తున్నా ఆ ఇద్దరుమాత్రం ప్రతిసారి తక్కువ రన్స్ కే పెవిలియన్ కు చేరుతున్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్లే అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా.. కొద్దిరోజులుగా విఫలమవుతున్నట్టే ఈ ఇద్దరూ కేప్టౌన్ టెస్టులో కూడా పేలవ ప్రదర్శన చేశారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ వీళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం మేలని ట్రోలింగ్ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టులో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. రెండో బంతికే పుజారా నిష్క్రమించగా.. ఆ వెంటనే రహానే కూడా తన స్నేహితుడి బాటనే అనుసరించాడు. పుజారా.. 9 పరుగులు చేయగా రహానే 1 పరుగు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో పుజారా (43) చెప్పుకోదగ్గ స్కోరు చేసినా రహానే మాత్రం 9 పరుగులకే వెనుదిరిగాడు.
2021 లో 21 ఇన్నింగ్సులు ఆడిన రహానే.. 411 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 19.57 గా ఉంది. ఇందులో రెండంటే రెండే హాఫ్ సెంచరీలున్నాయి. న్యూజిలాండ్ తో ఇటీవలే స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్ లో కూడా రహానే ఆకట్టుకోలేదు. కాన్పూర్ టెస్టులో 39 రన్స్ చేశాడు. ముంబై టెస్టులో గాయం కారణంగా ఆడలేదు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా అతడు వరుసగా విఫలమవుతున్నాడు. గత రెండు టెస్టులలో 4 ఇన్నింగ్సులు ఆడిన అతడు.. 68 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్టులో చేసిన 58 పరుగులు అత్యుత్తమ స్కోరు.
ఇక పుజారా విషయానికొస్తే.. 2021 లో 14 టెస్టులాడిన అతడు 26 ఇన్నింగ్సులలో 702 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 28.08 గా ఉంది. ఇక ఈ సిరీస్ లో కూడా పుజారా దారుణంగా విఫలమవుతున్నాడు. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో బతికిపోయిన అతడు.. మూడో టెస్టులో భారత్ కు అతి కీలకమైన సందర్భంలో మరోసారి నిరాశపరిచాడు.
దీంతో ఈ ఇద్దరిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మీ సేవలకు దండం.. ఇక మేము మిమ్మల్ని భరించలేం బాబోయ్.. ’, ‘థాంక్యూ రహానే, పుజారా.. హ్యాపీ రిటైర్మెంట్’, ‘ఇలాంటి ప్లేయర్లు ఇండియాకు అవసరమా..? శ్రేయస్ అయ్యర్, హనుమా విహారిలను జట్టులోకి తీసుకోవాలి’ అంటూ నెటిజన్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. రెండో టెస్టు సందర్భంగా కూడా ఈ ఇద్దరిపై ‘పురానే’ (పుజారా, రహానే పేర్లను కలుపుతూ..) అంటూ ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే.