IND vs SA: మాతో ఆడిన వారిలో సచిన్ టెండూల్కరే తోపు.. సౌతాఫ్రికా క్రికెట్ లెజెండ్ అలన్ డోనాల్డ్
India vs South Africa: సౌతాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ కుప్పకూలడంపై అలెన్ ఆంథోనీ డోనాల్డ్ విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో గేమ్ ఆడిన వారిలో ఇప్పటివరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే తోపు అంటూ పేర్కొన్నాడు.
![IND vs SA: Allan Donald Reveals Only Indian Batter Who Played Him Well In South Africa, sachin tendulkar RMA IND vs SA: Allan Donald Reveals Only Indian Batter Who Played Him Well In South Africa, sachin tendulkar RMA](https://static-ai.asianetnews.com/images/01gypyy8p8rwgwp7nw8v9sm0zy/pti04-23-2023-000079b_363x203xt.jpg)
Sachin tendulkar-Allan Anthony Donald: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్.. రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. సెంచూరియన్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ (82 బంతుల్లో 76 పరుగులు) మినహా మరే ప్లేయర్ రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేసినప్పటికీ అవతలి ఎండ్ నుంచి మద్దతు లేకపోవడంతో భారత్ 245 పరుగులకే ఆలౌటైంది. ఇక సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో స్టాండ్ ఇన్ కెప్టెన్ డీన్ ఎల్గర్ 185 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికా బౌలర్లు రెచ్చిపోవడంతో భారత ప్లేయర్లు బ్యాటింగ్ చేయడానికి కష్టపడ్డారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం ఐదు పర్యటనల్లో నాలుగు టెస్టు సెంచరీలు సాధించాడు. తొలి టెస్టులో భారత్ పేలవ ప్రదర్శన గురించి వివరంగా మాట్లాడిన ప్రొటీస్ మాజీ పేసర్, బౌలింగ్ దిగ్గజం అలెన్ డోనాల్డ్ దక్షిణాఫ్రికా గడ్డపై సచిన్ సాధించిన విజయాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ''మాతో బాగా ఆడిన ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ మాత్రమే, అతను దక్షిణాఫ్రికాలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిడిల్ స్టంప్ పై నిలబడకుండా ట్రిగ్గర్ కదలికలతో అద్భుత ప్రదర్శనలు చేశాడని'' డోనాల్డ్ తెలిపాడు.
David Warner: డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ లో ట్విస్ట్.. అవసరమైతే సిద్ధమేనంటూ..
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన విదేశీ ఇద్దరు ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ ఒకరు. 15 టెస్టుల్లో 1161 పరుగులు చేసి రెయిన్ బో నేషన్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాలో సచిన్ ఐదు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు సాధించాడు. భారత్ పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన నేపథ్యంలో డోనాల్డ్ జట్టు బ్యాటర్లకు సలహా ఇస్తూ.. సచిన్ తరహాలో బ్యాటింగ్ చేయాలనీ, మిడిల్ స్టంప్ పై నిలబడకుండా బంతిని వదిలేస్తే పరుగులు సాధించవచ్చునని తెలిపాడు. కేప్ టౌన్ లో మరింత కష్టపడాల్సి ఉంటుందనీ, ఇది మంచి టెస్టు పిచ్ అనీ, ఇది త్వరగా చదును అవుతుంది, కాబట్టి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.
కాగా, భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3న కేప్ టౌన్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ తో భారత టెస్టు జట్టు బరిలోకి దిగనుంది.
2024లో క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న టీమిండియా స్టార్ ప్లేయర్స్ !