INDvsAUS: మైదానంలోకి దూసుకొచ్చిన ఆందోళన కారులు... అదానీకి లోన్ ఇవ్వొద్దంటూ ఎస్బీఐకి వినతి...
290 రోజుల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా...
మ్యాచ్లకు 50 శాతం ప్రేక్షకులకు అనుమతి కల్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా...
మొదటి వన్డే మ్యాచ్కి అంతరాయం కలిగించిన ఉద్యమకారులు...
INDvsAUS 1st ODI: కరోనా బ్రేక్ కారణంగా 290 రోజుల తర్వాత తొలి వన్డే మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్కు ఆందోళనకారుల కారణంగా కాసేపు అంతరాయం కలిగింది. కరోనా నిబంధనల ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించారు.
వీరిలో ఇద్దరు యువకులు, సెక్యూరిటీ కంచెను దూకి మైదానంలోకి దూసుకొచ్చారు. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీకి 1 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వొద్దు..’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు ఈ ఇద్దరు ఆందోళనకారులు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న ఆరో ఓవర్ సమయంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరినీ వెనక్కి పంపించారు.
ఆస్ట్రేలియాకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ బొగ్గు గనుల తవ్వకాలు చేపడుతోంది. ఇందుకోసం భారత్కి చెందిన అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ నుంచి 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6 వేల కోట్లు) అప్పుగా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
పర్యావరణానికి హాని చేసే ఈ చర్యను అడ్డుకోవాలనే ఉద్దేశంలో ఆందోళన చేపడుతున్నారు కొందరు ఆస్ట్రేలియా యువత. ‘స్టాప్ అదానీ’ పేరుతో కొనసాగుతున్న ఈ ఉద్యమ సెగ మొదటి వన్డేపై పడింది.