ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా ఆస్ట్రేలియా... 210 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా...
తొలిసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 విజేతగా నిలిచింది. 10 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలవాలనే టీమిండియా కల నెరవేరలేదు. నాలుగో ఇన్నింగ్స్లో 444 పరుగుల రికార్డు లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, ఐదో రోజు తొలి సెషన్లోనే ఆలౌట్ అయిపోయింది.. 232 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, 210 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఓవర్నైట్ స్కోర్ 164/3 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 13 పరుగులు మాత్రమే జోడించి విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. అజింకా రహానే, విరాట్ కోహ్లీ కలిసి నాలుగో వికెట్కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
78 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, స్కాట్ బోలాండ్ బౌలింగ్లో స్లిప్లో స్టీవ్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, రెండో బంతికే అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు...
ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసిన స్కాట్ బోలాండ్, టీమిండియా అభిమానుల ఆశలపై నీళ్లు పోశాడు. శ్రీకర్ భరత్, అజింకా రహానే కలిసి ఆరో వికెట్కి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
108 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేసిన అజింకా రహానే, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. రహానే అవుటైన తర్వాత శార్దూల్ ఠాకూర్, నాథన్ లియాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
ఉమేశ్ యాదవ్ 12 బంతుల్లో 1 పరుగు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
41 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, నాథన్ లియాన్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసిన మహ్మద్ షమీ నాటౌట్గా నిలవగా సిరాజ్ 1 పరుగు చేసి నాథన్ లియాన్ బౌలింగ్లో అవుట్ అవ్వడంతో 234 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్కి తెరపడింది...
అంతకుముందు 444 పరుగుల భారీ టార్గెట్తో నాలుగో రోజు రెండో సెషన్లో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, శుబ్మన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయింది. 18 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, స్కాట్ బోలాండ్ బౌలింగ్లోనే కామెరూన్ గ్రీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే క్యాచ్ పట్టిన తర్వాత కామెరూన్ గ్రీన్ చేతిలోని బంతి, నేలను తాకినట్టు క్లియర్గా కనిపించింది.
అయినా థర్డ్ అంపైర్ అవుట్గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 27 పరుగులు చేసి అనవసర షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 9
