India vs England: 9 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్... 9 బంతులాడి డకౌట్ అయిన విరాట్ కోహ్లీ.. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తొలిసారి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు, 27 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్, ఫీల్డింగ్ ఎంచుకుంది. డేవిడ్ విల్లే వేసిన మొదటి ఓవర్‌లో రోహిత్ శర్మ పరుగులేమీ చేయలేదు.

మెయిడిన్ ఓవర్‌తో మ్యాచ్‌ని మొదలెట్టింది టీమిండియా. రెండో ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ ఫోర్ బాదాడు. డేవిడ్ విల్లే వేసిన మూడో ఓవర్‌లో 4, 6, 1, 1, 6 బాది 18 పరుగులు రాబట్టాడు రోహిత్ శర్మ. ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా..

13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాతి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే రాగా క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ కూడా మెయిడిన్‌గా ఇచ్చాడు రోహిత్ శర్మ..

మొదటి 9 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించి బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. వన్డే వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి..

విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇది 34వ డకౌట్. అత్యధిక సార్లు డకౌట్ అయిన టాపార్డర్ బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ.