వన్డే వరల్డ్ కప్‌లో 500+ మార్కు దాటిన మొదటి భారత సారథిగా రోహిత్ శర్మ రికార్డు...తొలి వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం...

బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో 27 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది భారత జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, వన్డే కెరీర్‌లో 12వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్‌ ఆడిన శుబ్‌మన్ గిల్, బౌండరీ లైన్ దగ్గర తేజ నిడమనురు పట్టిన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు..

54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రికార్డుల మోత మోగించాడు. ఈ వరల్డ్ కప్‌లో 503 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్‌లో 500+ మార్కు దాటిన మొదటి భారత సారథిగా నిలిచాడు. ఇప్పటిదాకా 2003 వన్డే వరల్డ్ కప్‌లో సౌరవ్ గంగూలీ చేసిన 465 పరుగులే భారత కెప్టెన్‌కి అత్యుత్తమ ప్రదర్శన..

రెండు వరల్డ్ కప్ టోర్నీల్లో 500+ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించాడు. సచిన్ 1996, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 500+ పరుగులు చేయగా రోహిత్ శర్మ 2019, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఈ ఫీట్ సాధించాడు. వరుసగా ఈ రెండు ప్రపంచ కప్ టోర్నీల్లో 500+ పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు హిట్ మ్యాన్..

ఈ మ్యాచ్‌లో కొట్టిన రెండు సిక్సర్లతో 2023లో 60 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు, ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డులు క్రియేట్ చేశాడు..