యువ భారత్కు భంగపాటు.. సూపర్ సిక్స్లో ఆసీస్ చేతిలో ఓటమి..
ICC Women Under-19 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ కు తొలి ఓటమి. ఆస్ట్రేలియా అమ్మాయిల చేతిలో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
టీమిండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ సారథ్యంలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న తొలి ఐసీసీ మహిళల అండర్ - 19 ప్రపంచకప్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా చేతిలో భారత్ కు భంగపాటు తప్పలేదు. లీగ్ దశలో మూడు మ్యాచ్ లు వరుసగా గెలిచిన టీమిండియా సూపర్ సిక్స్ దశకు చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ దశలో తొలి మ్యాచ్ లోనే భారత్ కు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. పోచెఫ్స్ట్రోమ్ వేదికగా ముగిసిన భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసీస్.. టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆసీస్ భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. గత మూడు మ్యాచ్ లలో మెరుపులు మెరిపించిన భారత బ్యాటర్లు బలమైన ఆసీస్ చేతిలో మాత్రం తేలిపోయారు. ఓపెనర్ శ్వేతా సెహ్రవత్ (21) టాప్ స్కోరర్. కెప్టెన్ షఫాలీ వర్మ (8), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (4), సోనియా మెందియ (2), వికెట్ కీపర్ రిచా ఘోష్ (7), పర్షవి చోప్రా (8) లు దారుణంగా విఫలమయ్యారు.
చివర్లో హృషిత బసు (14), టిటాస్ సాధు (14) ల వల్ల భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బ్యాటింగ్ లైనప్ లో రెండంకెల స్కోరు దాటినవాళ్లు ముగ్గురే. ఆసీస్ బౌలర్లలో సియానా జింజర్ మూడు వికెట్లతో చెలరేగగా.. మిల్లీ లిల్లింగ్వర్త్, మాగీ క్లార్క్ లు తలా రెండు వికెట్లు తీశారు. హేవర్డ్, మెక్ కెన్న కు తలా ఒక వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్.. 13.5 ఓవర్లలోనే ఛేదించింది. క్లారీ మూరే (25నాటౌట్), అమి స్మిత్ (26 నాటౌట్) లు రాణించారు. ఓపెనర్లు కేట్ పెల్లె (17), సియానా జింజర్ (11) లతో పాటు హేవర్డ్ (7) వికెట్లు పడ్డా ఆసీస్ అలవోకగా విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్ లో సౌతాఫ్రికా.. పాకిస్తాన్ ను ఓడించింది.
కాగా ఈ మ్యాచ్ ఓడినా భారత్ కు సెమీస్ కు చేరడానికి మరో అవకాశముంది... రేపు టీమిండియా శ్రీలంకతో ఆడనుంది. గ్రూప్ లో టాప్ -2 లో ఉన్న రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి.