T20 Worldcup: మరేంచేయాలి.. రోహిత్ శర్మను జట్టు నుంచి తీసేయమంటారా..? విరాట్ కోహ్లి ఘాటు వ్యాఖ్యలు
India vs Pakistan: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆదివారం రాత్రి దుబాయ్ లో జరిగిన పోరులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లి విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన హోరాహోరి పోరులో భారత్ (India)దారుణ పరాభవాన్ని మూటగట్టకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన పాక్ (Pakistan).. భారత అభిమాలకు తీరని వేదన మిగిల్చింది. మ్యాచ్ అనంతరం భారత సారథి విరాట్ కోహ్లి (virat kohli).. గంభీరంగా సమాధానాలు చెప్పినా అతడి ముఖంలోనూ నిర్వేదం కనిపించింది. ఇక భారత ఆటగాళ్ల ముఖాల్లోనైతే జీవం పోయింది.
ఇదిలాఉండగా.. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి ఓవర్లోనే ఔటైన రోహిత్ శర్మపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘మరేం చేయమంటారు..? రోహిత్ ను జట్టులోంచి తప్పించమంటారా..?’ అని అన్నాడు.
విరాట్ ను విలేకరి ఇలా అడిగాడు. ‘టీమ్ సెలక్షన్ పై మీరు సంతృప్తిగా ఉన్నారా..? రోహిత్ శర్మ (Rohit Sharma)కు బదులు ప్రాక్టీస్ మ్యాచ్ లలో భాగా ఆడిన ఇషాన్ కిషన్ (ishan Kishan) ను ఎందుకు తీసుకోలేదు..?’ అని ప్రశ్నించాడు. దానికి విరాట్ స్పందిస్తూ.. ‘ఇది చాలా ధైర్యమైన ప్రశ్న. మీరు ఏమనుకుంటున్నారు సార్..? నేను బెస్ట్ టీమ్ తో ఆడానని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రోహిత్ శర్మను టీ20 జట్టు నుంచి తప్పించమంటారా..? మీరు రోహిత్ శర్మను తొలగిస్తారా చెప్పండి..?’ అంటూ ఫైర్ అయ్యాడు.
అంతేగాక వివాదాలు కావాలంటే అందుకు ముందుగానే తనకు చెప్పాలని, తాను కూడా దానికి అనుగుణంగానే సమాధానం ఇస్తానని కోహ్లి అన్నాడు. చివరగా కోహ్లి ఆ రిపోర్డు వంక చూస్తూ.. ‘అన్ బిలీవెబుల్’ (నమ్మశక్యంకాని) అంటూ నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఐసీసీ కూడా ఈ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసింది.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిది (shaheen afridi).. అద్భుత డెలివరీతో రోహిత్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే అఫ్రిది.. రాహుల్ ను కూడా ఔట్ చేసి భారత్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో స్వల్ప లక్ష్యాన్ని పాక్ ముందుంచుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.