T20 World Cup: అరె.. వార్నర్ కు ఎలా ఇస్తారు..? మావాడు ఉన్నాడుగా.. ఆ అవార్డుపై అగ్గి రాజేసిన అక్తర్
Australia Vs New Zealand: టీ20 వరల్డ్ కప్ లో వార్నర్ భాయ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఇవ్వడంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అరె.. అలా ఎలా ఇస్తారు..? టోర్నీ ఆసాంతం రాణించినవాళ్లను పట్టించుకోరా..? అంటూ ఫైర్ అయ్యాడు.
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఫైనల్ ముగిసింది. మొట్టమొదటిసారి పొట్టి ప్రపంచకప్ గెలిచిన Australia.. మొత్తంగా కప్పు నెగ్గిన ఆరో దేశంగా కొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్లో New Zealand ను ఓడించిన కంగారూ సేన.. తన కీర్తి కిరీటంలో టీ20 ప్రపంచకప్ లేదన్న అపప్రదను తుడిపేసుకుంది. అయితే ఈ టోర్నీలో ఆసీస్ ఆటగాడు David Warnerకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఇవ్వడంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అరె.. అలా ఎలా ఇస్తారు..? టోర్నీ ఆసాంతం రాణించినవాళ్లను పట్టించుకోరా..? అంటూ ఫైర్ అయ్యాడు. ఇస్తే గిస్తే ఆ అవార్డు ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న మావాడికి ఇవ్వాలిగానీ.. అతడి కంటే తక్కువ రన్స్ చేసిన ఆటగాడికి ఎలా ఇస్తారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన Shoaib Akhtar.. ‘ఇది సరైన నిర్ణయం కాదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ బాబర్ ఆజమ్ కు దక్కుతుందని అనుకున్నాను. ఇదైతే కచ్చితంగా అన్యాయమే..’ అంటూ ట్వీట్ చేశాడు.
అక్తర్ వేదనకు కారణం లేకపోలేదు. టీ20 టోర్నీ ప్రారంభం నుంచి పాకిస్థాన్ కెప్టెన్ Babar Azam నిలకడగా రాణించాడు. టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన ఆజమ్.. మొత్తంగా ఆరు ఇన్నింగ్సులలో 303 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 60.60 గా ఉంది. అంతేగాక టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా కూడా ఉన్నాడు.
మరోవైపు వార్నర్.. ఏడు ఇన్నింగ్స్ లలో 289 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ సగటు 48.17 గా ఉంది. కానీ ఐసీసీ మాత్రం డేవిడ్ వార్నర్ ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా ఎంపిక చేయడం అక్తర్ అసంతృప్తికి కారణమైంది. సూపర్-12 దశ చివరి మూడు మ్యాచుల్లో ఫామ్ అందుకున్న వార్నర్.. పాక్ తో జరిగిన సెమీస్ లో దుమ్ము రేపాడు. ఫైనల్లో కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అక్తర్ ట్వీట్ పై పలువురు పాక్ ఫ్యాన్స్ కూడా స్పందించారు. అది బీసీసీఐ ఈవెంట్ అని, పాకిస్థానీ కి ఎలా ఇస్తారని అక్తర్ ట్వీట్ కు రిప్లై ఇవ్వడం గమనార్హం.
ఇదిలాఉండగా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పై ఆసీస్ కెప్టెన్ Aaron Finch కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన అభిప్రాయం ప్రకారం ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఆడమ్ జంపా అని వ్యాఖ్యానించాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన జంపా.. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచాడని కొనియాడాడు. ఈ టోర్నీలో 13 వికెట్లు తీసిన జంపా.. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. తొలిస్థానంలో శ్రీలంక బౌలర్ హసరంగ (16) ఉన్నాడు.