T20 World Cup: పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తావా? ఆమెపై ఆ కేసు పెట్టండి.. సానియా మీర్జాపై భారత అభిమానుల మండిపాటు
Sania Mirza: హైదరాబాదీ సానియా మీర్జా పై సైబర్ దాడి పెరిగింది. టీ20 ప్రపంచకప్ లో ఆమె తన భర్త షోయబ్ మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న భారత శత్రుదేశం పాకిస్థాన్ కు మద్దతు పలుకుతుండటంతో ఆమె పై నెటిజనులు కారాలు మిరియాలు నూరుతున్నారు.
భారత టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సానియా మీర్జాపై నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేయాలని, అంతేగాక ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలా నిరోధ చట్టం (ఉపా) కేసు పెట్టి దేశం నుంచి తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటంటే.. పాకిస్థాన్ కు మద్దతు పలకడం. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో గురువారం రాత్రి ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ కు హాజరైన సానియా మీర్జా.. అక్కడ పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు మద్దతు పలికింది. ఇదే ఇప్పుడు ఆమె ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండటానికి కారణమైంది.
గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా.. ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసి ప్రపంచకప్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అయితే 177 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. 16 ఓవర్ల దాకా విజయం మీద నమ్మకం లేదు. కానీ ఆ ఓవర్ నుంచే మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక షహీన్ అఫ్రిది వేసిన 19వ ఓవర్లో.. ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. అంతకుముందు ఇదే ఓవర్లో వేడ్ ఇచ్చిన క్యాచ్ ను హసన్ అలీ నేలపాలు చేశాడు.
దీంతో హసన్ అలీ తో పాటు అతడి భార్య సమీయా ను కూడా ట్రోల్ చేస్తున్నారు. సమీయా కూడా భారతీయురాలే. ఇక సమీయాతో పాటు ఈ మ్యాచ్ లో ఒక్క పరుగే చేసి ఔటైన షోయబ్ మాలిక్ ను కూడా పాక్ అభిమానులు వదలడం లేదు. సమీయా, సానియా ఇద్దరూ భారతీయులే అని, వారి వల్లే పాక్ ఓడిందని సైబర్ దాడికి దిగుతున్నారు.
ఇదీ చదవండి: Hasan Ali: పాపం.. కాస్త కనికరం చూపండి.. ఆ పాకిస్థాన్ క్రికెటర్ కు అండగా నిలుస్తున్న మాజీ కెప్టెన్
పాక్ అభిమానుల సంగతి అటుంచితే ఇండియన్ ఫ్యాన్స్ కూడా సానియా మీర్జాను ట్రోల్ చేస్తుండటం గమనార్హం. ఒక ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ.. ‘సానియా మీర్జా పాకిస్థాన్ కు మద్దతు తెలుపుతున్నది. ఆమె ఇప్పటికీ భారత పౌరసత్వం కలిగి ఉంది. పాకిస్థాన్ కు మద్దతు తెలిపినవారిపై ఉపా కేసు పెట్టినట్టు ఆమె పై కూడా భారత ప్రభుత్వం కేసు పెడుతుందా..?’ అని ప్రశ్నించాడు.
మరో వ్యక్తి.. ‘సానియా మీర్జా పాకిస్థానీ. ఎందుకంటే ఆమె ఆ దేశం ఆడుతుంటే చప్పట్లు కొడుతున్నది. సానియా.. భారత్ తరఫున టెన్నిస్ ఆడుతుంటే.. మాలిక్ పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు’ అని ట్వీట్ చేశాడు.
మరో యూజర్ స్పందిస్తూ.. ‘సానియా మీర్జా ఇంకా ఇండియాలో ఎందుకు జీవిస్తున్నది. ఆమె భారత జట్టుకు మద్దతు ప్రకటించగా నేనింతవరకు చూడలేదు. నరేంద్ర మోడీ గారూ.. ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయండి. ఆమెకు ఇక్కడ (ఇండియాలో) జీవించే హక్కు లేదు. ఇక విష్ణు సైనీ అనే యూజర్.. ‘సరిహద్దుల్లో రోజూ మన సైనికులను చంపుతున్న శత్రుదేశం పాకిస్థాన్ కు సానియా మీర్జా మద్దతు పలుకుతున్నది..’ అని ట్వీటాడు.