టీమిండియాకు బౌలర్ కెప్టెన్ కాకుడదని ఎక్కడా రాసిలేదు.. తదుపరి టీ20 సారథిపై భారత మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ashish Nehra: పొట్టి క్రికెట్ లో తర్వాత కెప్టెన్ కోసం బీసీసీఐ మల్లాగుల్లాలు పడుతున్నది. రేసులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి పేర్లు వినిపించాయి. తాజాగా ఇదే విషయమై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 సారథిగా తప్పుకుంటానని విరాట్ కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. పొట్టి క్రికెట్ లో విరాట్ వారసుడి కోసం బీసీసీఐ మల్లాగుల్లాలు పడుతున్నది. రేసులో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి పేర్లు వినిపించాయి. అయితే దీనిపై టీమ్ మేనేజ్మెంట్ ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఇదిలాఉండగా.. తాజాగా ఇదే విషయమై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు.
విరాట్ తర్వాత టీ20లతో పాటు వన్డేలకు కూడా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ను సారథిగా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెహ్రా మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ ను పక్కనెడితే.. మనం రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ ల పేర్లు కూడా వింటున్నాం. రిషభ్ పంత్.. స్వదేశంలోనే గాక విదేశాలకు వెళ్తున్నాడు. అక్కడా ఆడుతున్నాడు. అతడికి తుది జట్టులో ఆడే అవకాశం రాకుంటే డ్రింక్స్ తీసుకుపోవడం కూడా చేస్తున్నాడు. ఇక మయాంక్ అగర్వాల్ గాయపడిన సందర్భంలో కెఎల్ రాహుల్ కు పిలుపు వస్తున్నది. కానీ టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం అన్ని ఫార్మాట్లలో ఇరగదీస్తున్నాడు’ అని అన్నాడు.
ఇది కూడా చదవండి: T20 World cup: పాతవేవీ మనసులో పెట్టుకోకండి మామ.. ఈ మ్యాచ్ లో మీరు గెలవాలి.. మీమ్స్ తో టీమిండియా ఫ్యాన్స్ సందడి
ఇంకా నెహ్రా స్పందిస్తూ.. ‘వన్డే, టెస్టులు, టీ20 లు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రా విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అయినా బౌలర్లు కెప్టెన్లు కాకూడదని బీసీసీఐ రూల్ బుక్ లో ఎక్కడా రాసిలేదు’ అని చెప్పాడు. కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ కంటే.. బుమ్రాను సారథిగా చేస్తే బావుంటుందని నెహ్రా అభిప్రాయపడ్డాడు. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా.. నమ్మదగ్గిన బౌలర్ మాత్రమే కాదని, నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని తెలిపాడు.
ఇది కూడా చదవండి: T20 World cup: అఫ్గాన్ ఏం చేస్తుందో..? కివీస్ తో నేడు కీలక పోరు.. నబీ సేన ఓడితే టీమిండియా ఇంటికే..
భారత క్రికెట్ లో ఇప్పటివరకు పలువురు బౌలర్లు కూడా కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో ప్రముఖంగా.. ఆఫ్ స్పిన్నర్ ఎస్. వెంకట్ రాఘవన్ (1975-79), బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్ (ఆల్ రౌండర్), అనిల్ కుంబ్లే ఈ బాధ్యతలు మోశారు. వీరి తర్వాత భారత క్రికెట్ కు బౌలర్ సారథి కాలేదు.
ఇదిలాఉండగా.. టీ20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ఎవరనే విషయంపై బీసీసీఐ మరో వారం రోజుల్లో తేల్చనున్నది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానున్నది. న్యూజిలాండ్.. భారత్ తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్నది. టీ20 సిరీస్ కోసం ఇండియా కెప్టెన్ తో పాటు జట్టును కూడా బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. మరి పొట్టి ఫార్మాట్ లో టీమిండియాకు సారథిగా ఎవరిని నియమిస్తారో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.