T20 World cup: ఐపీఎల్ ఆడితే అదే గొప్ప అని అనుకుంటున్నారు.. టీమిండియాపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు
Wasim Akram comments on Team India: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్... టీమిండియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడితే చాలని.. వాళ్లు అంతర్జాతీయ సిరీస్ లను అంత సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నాడు.
దుబాయ్ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 World cup)లో హాట్ ఫేవరేట్ గా దిగిన టీమిండియా (Team India).. వరుసగా రెండు పరాజయాలతో చతికిలపడి తీవ్ర విమర్శలకు గురవుతున్నది. భారత ప్రదర్శనపై దేశంలోని క్రికెట్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక మాజీలు, సినియర్ క్రికెటర్లైతే విరాట్ కోహ్లి (Virat kohli) సారథ్యంలోని టీమిండియా ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత్ తో పాటు విదేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై పాకిస్థాన్ (Pakistan) మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ (Wasim Akram)... టీమిండియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడితే చాలని.. వాళ్లు అంతర్జాతీయ సిరీస్ లను అంత సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నాడు. భారత వైఫల్యానికి ఇదే ప్రధాన కారణమని కామెంట్స్ చేశాడు.
వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘టీమిండియా చివరిసారితగా మార్చిలో సీనియర్ ఆటగాళ్లతో అంతర్జాతీయ స్థాయిలో టీ20 సిరీస్ ఆడింది. ఆ తర్వాత పరిమిత ఓవర్లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత్ అంతర్జాతీయ సిరీస్ లను సీరియస్ గా తీసుకోవడం లేదు’ అంటూ కామెంట్ చేశాడు. అక్రమ్ చెప్పినట్టు.. భారత సీనియర్ ఆటగాళ్లు (ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నవాళ్లు) ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత ఒక్క టీ20 (ఐపీఎల్ తప్పిస్తే) కూడా ఆడలేదు. ఈ ప్రపంచకప్ కు ముందు టీమిండియా.. ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది.
ఇక జులై లో రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) కోచ్ గా శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జూనియర్ జట్టు శ్రీలంకతో ఆడింది. కానీ అందులో చాలా మంది జూనియర్ ఆటగాళ్లే.
ఇంకా అక్రమ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ లో ఆడితే సరిపోతుందని భారత క్రికెటర్లు అనుకుంటున్నారు. మీరు లీగ్ టోర్నీలు ఆడుతుంటే ప్రత్యర్థి జట్టులో ఒకరిద్దరు మాత్రమే అత్యుత్తమ బౌలర్లు ఉంటారు. అదే అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం ఐదుగురి దాకా మంచి బౌలర్లను ఎదుర్కొంటారు’ అని పేర్కొన్నాడు.
అంతేగాక ఆదివారం ముగిసిన న్యూజిలాండ్ (India Vs Newzealand) తో మ్యాచ్ లో భారత బ్యాటింగ్ లైనప్ పై కూడా అక్రమ్ కామెంట్స్ చేశాడు. జట్టు కూర్పు సరిగా లేదని అన్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) ను మూడో స్థానంలో ఆడించడం అతి పెద్ద తప్పుగా అభివర్ణించాడు.
‘ఇది ఏకపక్ష ఆట. భారత్ చాలా తప్పులు చేసింది. టాస్ ఓడినప్పుడే వాళ్లు మానసికంగా వెనక్కి నెట్టబడుతున్నారని నేను భావిస్తున్నాను. అన్నింటికీ మించి హిట్ మ్యాన్ రోహిత్ శర్మను మూడో స్థానంలోకి రప్పించడం గందరగోళానికి దారితీసింది. ఇది (ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్) తేల్చుకోవాల్సిన పోరు. అలాంటి గేమ్ లో టీ20లలో నాలుగు సెంచరీలు చేసిన ఓపెనర్ ను మూడో స్థానంలో పంపించడమా..? వాళ్లు (టీమిండియా) ఇషాన్ కిషన్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపిస్తే బావుండేద’ని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.