ICC: ఆటలను ఉపయోగించుకుని అడ్డదారుల్లో సంపాదిస్తామంటే వారిపై కఠిన చర్యలకు దిగడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెనుకాడటం లేదు. తాజాగా ఓ క్రికెటర్ పై ఏకంగా పద్నాలుగేండ్ల నిషేధం విధించింది. 

యూఈఏ క్రికెట్ జట్టుకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్ మెహర్ ఛాయ్‌కర్‌పై ఐసీసీ కొరడా విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పాటు అవినీతి, ఐసీసీ నియామవళిని ఉల్లంఘించినందుకు గాను మెహర్ పై ఏకంగా 14 ఏండ్ల నిషేధాన్ని విధించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి అతడిని నిషేధిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మెహర్ పై మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణలు రాగానే అతడిపై విచారణ మొదలుపెట్టిన ఐసీసీ.. బుధవారం తీర్పును వెల్లడించింది.

వివరాల్లోకెళ్తే.. భారత సంతతి క్రికెటర్ అయిన మెహర్ యూఏఈ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. అతడు 2018 ఆగస్టులో జింబాబ్వే-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ తో పాటు అదే ఏడాది కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 టోర్నీలలో బుకీలను సంప్రదించి ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో మెహర్ ను అదుపులోకి తీసుకున్న ఐసీసీ.. అతడిపై విచారణ చేపట్టింది. విచారణలో అతడు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు అంగీకరించాడు. దీంతో అతడిపై 14 ఏండ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యూనల్ తెలిపింది. 

ఇదే విషయమై ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. ‘2018లో అజ్మన్ లో జరిగిన మ్యాచ్ లో మెహర్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు మాకు సమాచారం అందింది. దీంతో మేం అతడిని విచారించాం. మ్యాచ్ ఫిక్సింగ్ తో పాటు ఐసీసీ నియామవళిని కూడా ఉల్లంఘించాడని మా విచారణలో తేలింది. అందుకే మెహర్ పై 14 ఏండ్ల నిషేధాన్ని విధించాం. క్రికెట్ ను భ్రష్టు పట్టించే ప్రయత్నించే ఆటగాళ్ల మీద కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆట ప్రతిష్టను దెబ్బతీస్తే ఎలాంటి చర్యలకైనా దిగుతాం..’ అని హెచ్చరించాడు.

Scroll to load tweet…

ఇదిలాఉండగా యూఏఈ క్రికెటర్లు నిషేధం ఎదుర్కోవడం ఇదేం కాత్త కాదు. గతంలో యూఏఈ మాజీ సారథి మహ్మద్ నవీన్ తో పాటు షైమన్ అన్వర్, ఖదీర్ అహ్మద్, గులామ్ షబ్బీర్ లు ఇప్పటికే నిషేధం ఎదుర్కుంటున్నారు. ఈ జాబితాలో చేరిన నాలుగో క్రికెటర్ మెహర్. 

Scroll to load tweet…