భయంతో బాత్రూమ్ లో దాక్కున్న న్యూజిలాండ్ క్రికెటర్..!
ఆరో రోజు ఆఖరి సెషన్ లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. భయంతో కైల్ జేమీసన్.. బాత్రూమ్ లో దాక్కున్నాడట.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విజయంలో న్యూజిలాండ్ యువ క్రికెటర్ కైల్ జేమీసన్ కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్ మాయాజాలంతో.. కోహ్లీ సేనను దెబ్బతీశాడు. తొలి రెండు ఇన్నింగ్స్ లో... కోహ్లీ సేనను ఓడించాడు.
ఈ ఛాంపియన్ షిప్... ఆరో రోజు ఆఖరి సెషన్ లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. భయంతో కైల్ జేమీసన్.. బాత్రూమ్ లో దాక్కున్నాడట. టీమిండియా అభిమానులు చేస్తున్న శబ్దాలు విని భయంతో దాక్కున్నానని చెప్పడం గమనార్హం.
తన కెరీర్ లో క్రికెట్ చూడటంలో కష్టమైన సమయం ఇదేనని కైల్ జేమీసన్ పేర్కొన్నారు. తామంతా లోపల కూర్చొని టీవీలో క్రికెట్ చూస్తున్నామని... స్టేడియంకీ.. లైవ్ మ్యాచ్ కి మధ్య కొంత గ్యాప్ ఉంటుందని.. కానీ.. బాల్ , బాల్ కీ ఇండియన్ అభిమానులు అరుస్తూ శబ్దాలు చేస్తూనే ఉన్నారని.. వికెట్ పడిందేమోనని భయం చేసి చూస్తే.. డిఫెండ్ చేయడం కానీ.. సింగిల్ కానీ తీయడం కనిపించేదని పేర్కొన్నాడు.
ఆ సమయంలో క్రికెట్ చూడటం చాలా కష్టంగా అనిపించిందని అతనే పేర్కొనడం గమనార్హం. వాళ్ల అరుపులు వినలేక.. బాత్రూమ్ కి వెళ్లి దాక్కున్నానని చెప్పాడు. అయితే.. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్నది కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ కావడంతో.. వాళ్లు ప్రశాంతంగా ఆడి.. విజయం సాధించారని చెప్పుకొచ్చాడు.