సామి శిఖరం.. నేనిప్పుడే మొదలుపెట్టా.. ధోనిపై ప్రేమను చాటుకున్న ఇషాన్.. వీడియో వైరల్
Ishan Kishan: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇటీవలే వన్డేలలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రస్తుతం ఇషాన్ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు.
ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించి రికార్డులు బద్దలుకొట్టిన ఇషాన్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జార్ఖండ్ కు చెందిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్.. మూడో వన్డేలో 131 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. తాజాగా ఇషాన్.. మహేంద్ర సింగ్ ధోని గురించి చెబుతూ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధోని సిగ్నేచర్ చేసిన చోట సంతకం పెట్టేంత స్థాయి తనకు లేదంటూ ఇషాన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్ దగ్గరికి ఓ అభిమాని ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలని సదరు అభిమాని.. ఫోన్ తీసి ఇచ్చాడు. ఫోన్ బ్యాక్ కవర్ మీద ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అతడు కోరాడు. అయితే అప్పటికే ఆ ఫోన్ బ్యాక్ కవర్ మీద జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని సంతకం ఉంది.
ఆ ఫోన్ ను చూడగానే ఇషాన్.. ‘ఇక్కడ నేను సంతకం ఎలా చేయాలి..? అక్కడ మహి భాయ్ (ఎంఎస్ ధోని) సిగ్నేచర్ ఉంది. దాని మీద నేను నా సంతకం ఎలా చేయగలను..? ఆయన స్థాయిని చేరుకునేంత స్టేజ్కు నేనింకా ఎదగలేదు. ఇక్కడ స్పేస్ లేకున్నా.. ధోని భయ్యా సిగ్నేచర్ కింద నేను సైన్ చేస్తా..’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ధోని మాదిరే ఇషాన్ కూడా జార్ఖండ్ కు చెందినవాడే. ఇద్దరూ వికెట్ కీపర్ బ్యాటర్లుగా భారత జట్టుకు ఎంట్రీ ఇచ్చినవారే. ధోనిని తన ఆరాధకుడిగా భావించే ఇషాన్.. తాజాగా తన అభిమాన ఆటగాడి గురించి చేసిన వ్యాఖ్యలు, మహేంద్రుడికి అతడిచ్చే గౌరవం చూసి నెటిజనులు ఇషాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా రంజీ ట్రోఫీలో భాగంగా ఇషాన్.. కేరళతో ముగిసిన తొలి మ్యాచ్ లో సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్ లో ఇషాన్.. 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 132 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ లో కేరళ 85 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ త్వరలోనే శ్రీలంకతో జరిగే వన్డే, టీ20లలో చోటు దక్కించుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. డబుల్ సెంచరీ చేసిన తర్వాత జట్టులో అతడి స్థానం మెరుగయ్యింది.