SAFF Championship 2023: తాను పోరాట యోధుడినని, అవసరమైతే తన ఆటగాళ్లకు అండగా ఉండేందుకు మరోసారి అలా చేయడానికి వెనుకాడనని భారత ఫుట్బాల్ కోచ్ ఇగార్ స్టిమాక్ పేర్కొన్నాడు.
భారత్ - పాకిస్తాన్ మధ్య రెండ్రోజుల క్రితం బెంగళూరు వేదికగా ముగిసిన ఫుట్బాల్ మ్యాచ్లో భాగంగా తొలి అర్థభాగం ముగుస్తుందనగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం రేగిన విషయం తెలిసిందే. వాగ్వాదం కాస్త ఘర్షణగా మారి ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. టీమిండియా కోచ్ ఇగార్ స్టిమాక్.. పాక్ ఆటగాడి వద్ద బంతిని నెట్టేయడంతో గొడవ మొదలైంది.
అయితే ఈ ఘర్షణతో భారత కోచ్ ఇగార్.. మ్యాచ్ రిఫరీల ఆగ్రహానికి గురయ్యాడు. ఇగార్.. ఫస్టాఫ్ లో పాకిస్తాన్ ఆటగాడి నుంచి బంతిని నెట్టేయడం వివాదానికి కారణమైంది. దీంతో మ్యాచ్ రిఫరీ ఇగార్ కు రెడ్ కార్డ్ చూపించాడు.
తాజాగా ఈ వివాదంపై ఇగార్ ట్విటర్ వేదికగా స్పందించాడు. తాను పోరాట యోధుడినని, అవసరమైతే తన ఆటగాళ్లకు అండగా ఉండేందుకు మరోసారి ఇలా చేయడానికి వెనుకాడనని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇగార్ స్పందిస్తూ.. ‘ఫుట్బాల్ అనేది ఫ్యాషన్కు సంబంధించిన అంశం. మీ దేశం కోసం ఆడేప్పుడు ఎంతవరకైనా పోరాడాలి. పాకిస్తాన్ తో మ్యాచ్ లో నా ప్రవర్తన కొంతమందికి నచ్చింది. మరికొంతమందికి నచ్చలేదు. అయితే మ్యాచ్ లో అన్యాయమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు నేనెంతవరకైనా వెళ్తా. నేను ఒక పోరాట యోధుడిని. అవసరమైతే మరోసారి ఇలాగే చేయడానికి నేను సిద్ధమే..’అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఇటీవలే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన భారత జట్టు శాఫ్ ఛాంపియన్షిప్ ను కూడా ఘనంగా ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్ లోనే 4-0 గోల్స్ తో పాక్ ను మట్టి కరిపించింది. భారత సారథి సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్కు గోల్ చేయడానికి అవకాశమే ఇవ్వకుండా భారత్ సమర్థవంతంగా డిఫెండ్ చేసుకుంది.
సునీల్ ఛెత్రి ఆట పదో నిమిషంలోనే తొలి గోల్ కొట్టాడు. తొలి గోల్ చేసిన ఊపులో ఛెత్రి మరో ఆరు నిమిషాలకే రెండో గోల్ కూడా చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్లాడు. ఆట రెండో భాగంలో పాక్ భారత దాడిని బాగానే డిఫెండ్ చేసింది. అయితే ఆట 74వ నిమిషంలో పాక్ ఆటగాళ్లు ఛెత్రిని కిందపడేయడంతో భారత్కు ఫెనాల్టీ కిక్ దక్కింది. ఛెత్రి దానిని గోల్ గా మలిచి హ్యాట్రిక్ గోల్ కొట్టాడు.
