ముంబైలో కరోనా తీవ్రత.. హైదరాబాద్లో మ్యాచ్లు పెట్టండి: బీసీసీఐకి అజహరుద్దీన్ ఆఫర్
నవతెలంగాణ, హైదరాబాద్: మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి షరవేగంగా విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే సుమారు 50,000 కొత్త కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి షరవేగంగా విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే సుమారు 50,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబయి నగరంలో కొత్త కేసుల సంఖ్య పది వేలకు చేరువగా ఉంది.
దీనికి తోడు ముంబయిలో సాధన చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అక్షర్ పటేల్, చెన్నై సూపర్కింగ్స్ శిబిరంలో ఓ టెక్నికల్ సిబ్బంది సహా వాంఖడే స్టేడియంలో ఎనిమిది మంది గ్రౌండ్స్మెన్, బీసీసీఐ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్లో ఆరుగురు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చటంతో ముంబయిలో ఐపీఎల్ నిర్వహణ కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. లాక్డౌన్ విధించినా ఐపీఎల్ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి బీసీసీఐకి లభించనుంది.
ముంబయి సహా ఇతర ఏ వేదికల్లోనైనా ఇబ్బందులు ఎదురైతే ప్రత్యామ్నాయ వేదికలుగా హైదరాబాద్, ఇండోర్లను బీసీసీఐ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఆదివారం ట్వీట్ చేశారు.
విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణకు హైదరాబాద్ వేదికను వినియోగించుకోవాలని బీసీసీఐకి ఆఫర్ చేశాడు. 'ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనం అందరం కలిసికట్టుగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్ను సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు హైదరాబాద్ వేదికను బీసీసీఐకి ఆఫర్ చేస్తున్నాము' అని అజహరుద్దీన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్కు ఐపీఎల్ మ్యాచులు తరలించటం సైతం అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు.