Asia Cup: పాక్ పై ఓడినా ఇలా ఫైనల్ వెళ్లొచ్చు.. టీమిండియా ఏం చేయాలంటే...?
Asia Cup 2022: సూపర్-4లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు ఆసియా కప్ ఫైనల్ వెళ్లడానికి గల అవకాశాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆదివారం ముగిసిన ఉత్కంఠపోరులో భారత్ కు పరాభవం తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ తోనే అంతా అయిపోలేదు. ఈ మ్యాచ్ ఓడినా ఆసియా కప్ ఫైనల్ కు చేరే అవకాశాలు భారత్ కు మెండుగా ఉన్నాయి. భారత్.. తన తర్వాత మ్యాచులను శ్రీలంక, అఫ్గానిస్తాన్ తో ఆడాల్సి ఉంది. భారత్ ఫైనల్ చేరాలంటే ఈ రెండు మ్యాచులు చాలా కీలకం. భారత్ ఫైనల్ చేరే మార్గాలను ఓసారి పరిశీలిస్తే..
పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత భారత జట్టు.. ఈనెల 6న శ్రీలంకతో తలపడాల్సి ఉంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 8న భారత్.. అఫ్గానిస్తాన్ తో ఆడనుంది. భారత్ ఫైనల్ చేరాలంటే ఈ రెండు మ్యాచులలో తప్పకుండా నెగ్గాలి.
ఆసియా కప్-2022 నిబంధనల ప్రకారం సూపర్-4లో టాప్-2గా నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి. గ్రూప్ దశలో టాప్-2గా నిలిచిన రెండు జట్లు (భారత్, అఫ్గానిస్తాన్) అనూహ్యంగా ఓటమిపాలయ్యాయి. గ్రూప్ దశలో శ్రీలంకను ఓడించిన అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ ను ఓడించిన భారత్.. సూపర్-4లో అవే ప్రత్యర్థుల చేతిలో చతికిలపడ్డాయి. దీంతో సూపర్-4 పాయింట్ల పట్టికలో శ్రీలంక అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం సూపర్-4లో శ్రీలంక ఒక మ్యాచ్ ఆడి అందులో గెలిచి 2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ (+0.589) కూడా మెరుగ్గా ఉంది. రెండో స్థానంలో పాకిస్తాన్.. రెండు పాయింట్లతోనే ఉన్నా ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.126గా ఉంది. మూడోస్థానంలో ఉన్న భారత్.. -0.126తో ఉండగా అఫ్గానిస్తాన్.. -0.589తో నాలుగో స్థానంలో ఉంది.
శ్రీలంక, అఫ్గానిస్తాన లతో ఏ ఒక్క మ్యాచ్ లో ఫలితం తారుమారు అయినా ఆసియా కప్ లో భారత్ కథ ముగిసినట్టే. మరి రోహిత్ సేన మిగిలిన రెండు మ్యాచులు నెగ్గుతారా..? లేకుంటే లంక, అఫ్గాన్ లు భారత్ కు షాకిస్తాయా తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.