హెచ్ సీఏలో వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. మొహమ్మద్ అజరుద్దీన్ స్థానంలో వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ ను అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. దీనిపై అజరుద్దీన్ ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్: హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో వివాదం ముదురుతోంది. అజరుద్దీన్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ జాన్ మనోజ్ ను తాత్కాల్కి అధ్యక్షుడిగా నియమించినట్లు అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ ఘాటుగా స్పందించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియామకం చెల్లదని అజరుద్దీన్ అన్నారు. కావాలనే తనపై అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ లో ఉన్నారని చెబుతున్న ఐదుగురు కూడా దొంగలేనని ఆయన అన్నారు. దొంగలే.. దొంగలు దొంగలంటూ అరుస్తున్నారని ఆయన అన్నారు. 

అపెక్స్ కౌన్సిల్ లో ఉన్న ఐదుగురిపై ఏసీబీ కేసులున్నాయని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. అపెక్స్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చినా చెల్లవని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని ఆయన అన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనేదే బూటకమని అజరుద్దీన్ అన్నారు.

ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న జాన్ మనోజ్ ను అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వారు కార్యదర్శి ఆర్ విజయానంద్, జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ పి. అనురాధ. వారు గత కొంత కాలంగా అజరుద్దీన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. జూన్ 10వ తేదీన ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో అజరుద్దీన్ ను సస్పెండ్ చేశారు.