ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్... ఐసీసీ మంత్లీ అవార్డు దక్కించుకున్న మొదటి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు... 

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది. సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టుకి సారథిగా వ్యవహరించిన హర్మన్‌‌ప్రీత్ కౌర్.. మూడు వన్డేల సిరీస్‌లో 221 పరుగులు చేసింది...

మొదటి రెండు మ్యాచుల్లో ఫినిషర్ రోల్ పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్, తొలి వన్డేలో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. స్మృతి మంధాన (91 పరుగులు), హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ల కారణంగా 228 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది భారత మహిళా జట్టు. రెండో వన్డేలో 111 బంతుల్లో 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది హర్మన్‌ప్రీత్ కౌర్...

100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, సెంచరీ తర్వాత బౌండరీల మోత మోగించింది. సెంచరీ తర్వాత 11 బంతుల్లో 43 పరుగులు రాబట్టింది హర్మన్‌ప్రీత్. 

సెంచరీ తర్వాత వరుసగా 6,4,4,6,4,1,6,4,4,4,0 బాదిన హర్మన్‌ప్రీత్ కౌర్, 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కి వన్డేల్లో ఇది ఐదో సెంచరీ కాగా ఈ ఏడాది భారత జట్టు తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా నిలిచిందామె...

అలాగే రెండో టీ20లో 22 బంతుల్లో 29 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్, భారత జట్టుకి విజయాన్ని అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో భారత ఓపెనర్ స్మృతి మంధాన, నిగర్ సుల్తానా కూడా నిలిచారు..

అయితే స్మృతి మంధాన కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ అవార్డు గెలిచిన మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ అవార్డు గెలిచిన ఐదో భారత క్రికెటర్ హర్మన్‌ప్రీత్...

2021లో ప్రవేశపెట్టిన ఐసీసీ మంత్లీ అవార్డుల్లో మొదటి మూడు నెలలు భారత క్రికెటర్లనే ఈ అవార్డులు వరించాయి. జనవరి 2021లో రిషబ్ పంత్, ఫిబ్రవరిలో రవిచంద్రన్ అశ్విన్, మార్చిలో భువనేశ్వర్ కుమార్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను వరుసగా దక్కించుకున్నారు...

ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రేయాస్ అయ్యర్ ఈ అవార్డు దక్కించుకోగా, సెప్టెంబర్ 22కి గానూ హర్మన్‌ప్రీత్‌కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కింది.. 


‘ఈ అవార్డుకి నామినేట్ కావడం, గెలవడం చాలా సంతోషంగా ఉంది. స్మృతి మంధాన, నిగర్‌లతో కలిసి ఈ అవార్డుకి నామినేట్ కావడమే గర్వకారణంగా భావిస్తున్నా. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ గెలవడం నా కెరీర్‌లో ఓ లాండ్ మార్క్‌గా మిగిలిపోతుంది’ అంటూ కామెంట్ చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్...

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌లో మూడు వన్డేల సిరీస్‌ని క్లీన్‌ స్వీప్ చేసింది భారత జట్టు. 1999 తర్వాత ఇంగ్లాండ్‌లో భారత మహిళా జట్టుకి దక్కిన మొట్టమొదటి వన్డే సిరీస్ విజయం ఇది...