హర్భజన్ సింగ్కి కరోనా పాజిటివ్... లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో...
సోషల్ మీడియా ద్వారా కరోనా సోకినట్టు తెలియచేసిన హర్భజన్ సింగ్... లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సిన భజ్జీ...
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సిన హర్భజన్ సింగ్, కరోనా లక్షణాలు ఉండడంతో ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు హర్భజన్ సింగ్...
‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, కొన్ని లక్షణాలు ఉన్నాయి. మా ఇంట్లో క్వారంటైన్లో ఉండి, అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నా. నన్ను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. జాగ్రత్తగా ఉండండి... ’ అంటూ ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్...
హర్భజన్ సింగ్తో వీరేంద్ర సెహ్వాగ్ కూడా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో కొన్ని మ్యాచులకు దూరంగా ఉండబోతున్నారు. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ల మాదిరిగానే టీమిండియాకి ఎంతో సేవ చేసినా, సరైన గౌరవం దక్కకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్...
టెస్టు క్రికెట్లో 400+ పైగా వికెట్లు తీసిన తర్వాత కూడా టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి వేచి చూడాల్సి వచ్చింది సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్...
అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వారం రోజులకి ఇచ్చిన ధోనీ, బీసీసీఐ అధికారుల గురించి కొన్ని ఇంట్రెస్టింట్ వ్యాఖ్యలు చేశాడు హర్భజన్ సింగ్...
‘మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే నాకు అదృష్టం కూడా చాలాసార్లు తోడుగా ఉండింది. అయితే కొన్ని అంతర్గత వ్యవహారాల కారణంగా నేను టీమ్లో ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది...
టెస్టుల్లో 400+ వికెట్లు తీసిన ప్లేయర్ను ఎలా రిజర్వు బెంచ్లో కూర్చోబెడతారు? మాహీకి నాతో వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు...
నన్ను టీమ్కి ఎంపిక చేయనప్పుడు చాలా సార్లు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దగ్గరికి వెళ్లి, కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించాను...అయితే ఎప్పుడూ కూడా ధోనీ నాకు సరిగా ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడే నాకు అర్థమైంది, నాకు సమాధానం చెప్పడం కూడా అతనికి ఇష్టం లేదని...
కొన్ని విషయాలు మాహీ చేతుల్లో కూడా లేవని అర్థమైంది. బీసీసీఐ అధికారులు, నన్ను పక్కనబెట్టారు. వారి నిర్ణయాన్ని మాహీ గౌరవించాడు...
31 ఏళ్ల వయసులో నేను టెస్టుల్లో 400 వికెట్లకు పైగా తీశాను... ఆ తర్వాత 8, 9 ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగగలనని నాకు తెలుసు. నాకు సరిగ్గా అవకాశాలు వచ్చి ఉంటే, ఈజీగా మరో 100, అంతకుమించి వికెట్లు తీసి ఉండేవాడిని...
కానీ నాకు అవకాశాలు రాలేదు. నన్ను తుది జట్టుకి ఎంపిక చేయకుండా రిజర్వు బెంచ్లో కూర్చొబెట్టేవాళ్లు, ఆ తర్వాత కొన్నాళ్లకు ఎంపిక చేయడం కూడా మానేశారు...
మాహీ కొందరు ప్లేయర్లను బాగా సపోర్ట్ చేశాడు, మిగిలిన వాళ్లకి ధోనీ నుంచి అలాంటి సహకారం దక్కలేదు... అందుకే వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ ఎండింగ్లో ఛాన్స్లు దక్కించుకోలేక రిటైర్మెంట్ ప్రకటించారు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...