ఆఖరి టీ20 మ్యాచ్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్...  గడ్డి పూర్తిగా ఎండిపోయిందంటూ సిరాజ్ హెయిర్ స్టైల్‌పై చాహాల్ ఫన్నీ కామెంట్స్...

టీమిండియా స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా 12 మ్యాచుల్లో గెలిచిన రోహిత్ సేన, శ్రీలంకతో మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం ఎదురుచూస్తోంది...

మూడో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న భారత జట్టు, ఆ గెలుపును టీమ్ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంది. చాహాల్ టీవీ అంటూ ఫన్నీ ఫన్నీ ఇంటర్వ్యూలతో టీమిండియా అభిమానులను అలరించే యజ్వేంద్ర చాహాల్, మరోసారి తన స్టైల్‌లో వినోదాన్ని పంచాడు...

మూడు టీ20 మ్యాచుల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన శ్రేయాస్ అయ్యర్‌ను ఇంటర్వ్యూ చేసిన యజ్వేంద్ర చాహాల్, తర్వాత అక్కడికి వచ్చిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించాడు...

Scroll to load tweet…

‘వెల్ కమ్ సిరాజ్... చూడండి అతని జుట్టు... ఎవ్వరూ నీళ్లు పోయక ఎండిపోయిన గడ్డిలా ఎలా తయారయ్యిందో... గడ్డి పూర్తిగా ఎండిపోయింది...’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్. చాహాల్ కామెంట్‌కి సిరాజ్‌ సిరీయస్‌గా చూస్తూ ఉండిపోతే, పక్కనే ఉన్న శ్రేయాస్ అయ్యర్ పగలబడి నవ్వాడు...

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ. మొదటి రెండు టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోయిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్,. ఆఖరి టీ20 మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చి అదిరిపోయే స్పెల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించాడు... 

తొలి ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి గుణతిలకను డకౌట్ చేసిన మహ్మద్ సిరాజ్, 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరో ఎండ్‌లో యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్‌ కూడా తొలి ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా వేశాడు. 

విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన ఆవేశ్ ఖాన్, శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్ చెరో వికెట్ తీయగా, కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. 

లంకతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో 200+ పైగా పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. విరాట్ కోహ్లీ మూడు టీ20ల సిరీస్‌లో 183 పరుగులు చేయడమే ఇప్పటిదాకా టీమిండియాకి అత్యుత్తమ ప్రదర్శనగా ఉండేది. శ్రేయాస్ అయ్యర్ ఆ రికార్డును అధిగమించి, కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు...

సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...