IPL 2025: కేకేెఆర్ జట్టు 2024 ఐపీఎల్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని సునీల్ గవాస్కర్ విమర్శించారు. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కి చేరుకోవడంలో అయ్యర్ నాయకత్వాన్ని గవాస్కర్ ప్రశంసించారు.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 దాదాపు తుదిదశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి. 4th ప్లేస్ కోసం ముంబై, ఢిల్లీ, లక్నో జట్లు పోటీపడుతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ ని ప్లేఆఫ్స్ కి నడిపించిన శ్రేయస్ అయ్యర్ పై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అలాగే, కేకేఆర్ పై విమర్శలు గుప్పించాడు. కేకేఆర్ తీరును ఆయన తప్పుబట్టారు. ఐపీఎల్ టైటిల్ గెలవని పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ ప్లేఆఫ్స్ కి చేర్చాడు. గత పది సీజన్లలో ప్లేఆఫ్స్ కి దూరంగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ సారి అయ్యర్ నాయకత్వంలో మంచి ప్రదర్శనలు చేసింది. అలాగే, అయ్యర్ సైతం వ్యక్తిగతంగా బ్యాటింగ్ తోనూ అదరగొట్టాడు. 

రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన తర్వాత, గుజరాత్ టైటాన్స్ ఢిల్లీని ఓడించడంతో పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్ కి చేరుకుంది.

కేకేెఆర్, గంభీర్ పై గవాస్కర్ విమర్శలు

స్టార్ స్పోర్ట్స్ తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2024 లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ కి తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. డగ్ అవుట్ లో కూర్చునే వాళ్లకన్నా, మైదానంలో ఆడే కెప్టెన్ కే గుర్తింపు దక్కాలని పరోక్షంగా గంభీర్ ని విమర్శించారు.

"గత సీజన్ లో ఐపీఎల్ గెలిచినా అయ్యర్ కి గుర్తింపు రాలేదు. డగ్ అవుట్ లో కూర్చున్న వాళ్లకే ప్రశంసలు దక్కాయి. మైదానంలో ఆటను నడిపించే కెప్టెన్ కే ప్రాధాన్యత ఇవ్వాలి" అని గవాస్కర్ అన్నారు.

"ఈ ఏడాది అయ్యర్ కి న్యాయం జరుగుతోంది. రికీ పాంటింగ్ కి ఎవరూ క్రెడిట్ ఇవ్వడం లేదు" అని ఆయన అన్నారు.

Scroll to load tweet…

 

గత సీజన్ లో కేకేఆర్ మూడో టైటిల్ గెలిచినప్పుడు గౌతమ్ గంభీర్ మెంటార్ గా ఉన్నారు. అయ్యర్ కెప్టెన్సీ కన్నా గంభీర్ వ్యూహాలకే ఎక్కువ గుర్తింపు దక్కింది. టైటిల్ అందించిన కెప్టెన్ అయినా పరిగణలోకి తీసుకోకుండా ఐపీఎల్ 2025 కి ముందు కేకేెఆర్ అయ్యర్ ని వదిలేసింది. ఆర్థిక కారణాల వల్లే అతన్ని వదిలేసినట్టు వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ అయ్యర్ ని 26.75 కోట్లకి కొనుగోలు చేసింది.

అయ్యర్ కి మంచి సీజన్

బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కకపోయినా శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లలో 181 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పై గెలిచి 12 ఏళ్ల తర్వాత భారత్ కి టైటిల్ అందించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ 2025 సమయంలో అయ్యర్ కి మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కింది. ఐపీఎల్ 2025 లో 12 మ్యాచ్ లలో 435 పరుగులు చేశాడు. కెప్టెన్ పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు.