India Vs Srilanka T20 Series: ఒకటి, రెండు మ్యాచులలో చేసిన ప్రయోగాల వల్ల పెద్దగా ఫలితం లేదని తేలింది. దీంతో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇక వాటికి...
శ్రీలంకతో గురువారం నుంచి లక్నో వేదికగా ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ లో ప్రయోగాలకు చోటులేదని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ లో చేసినట్టుగా ఈ సిరీస్ లో ప్రయోగాలకు చోటులేదని.. ఇక నుంచి తానే ఓపెనర్ గా బరిలోకి దిగుతాననిని చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం సందర్బంగా పాత్రికేయులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ సమావేశంలో రోహిత్.. జట్టు కూర్పు, టెస్టు కెప్టెన్సీ, భవిష్యత్ ప్రణాళికలు, తదితర అంశాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ స్పందిస్తూ.. ‘అది కేవలం ఆ మ్యాచ్ కోసమే. టీ20 వరల్డ్ కప్ ఎంతో దూరంలో లేదు. ఇక ప్రయోగాలకు ఆస్కారం లేదు.లంకతో సిరీస్ లో నేనే ఓపెనర్ గా వస్తా..’ అని తెలిపాడు. ఇటీవలే విండీస్ తో ముగిసిన మూడో టీ20లో ఇషాన్ కిషన్-రుతురాజ్ గైక్వాడ్ లు టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచులో రోహిత్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. కాగా.. వన్డే సిరీస్ సందర్భంగా కూడా రోహిత్ ఇటువంటి ప్రయోగమే చేశాడు. అహ్మదాబాద్ లో జరిగిన రెండో వన్డేలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను ఓపెనర్ గా బరిలోకి దించాడు. దీంతో రోహిత్ ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాడని అంతా భావించారు. కానీ తర్వాత మ్యాచులో మాత్రం ధావన్ తో రోహిత్ ఓపెనర్ గా కొనసాగాడు. ఇక లంకతో ప్రారంభం కాబోయే సిరీస్ లో కెఎల్ రాహుల్ కూడా లేకపోవడంతో భారత్ కు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి రోహిత్ శర్మ.. ఇన్నింగ్సును ఆరంభించే అవకాశముంది. కోహ్లి గైర్హాజరీతో ఇషాన్ కిషన్ ను వన్ డౌన్ లో ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది.
సూర్య గాయపడటం బాధాకరం..
కోహ్లి, పంత్ లకు ఈ సిరీస్ లో విశ్రాంతినివ్వడంతో మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కు గాయం కావడం భారత్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ. ఫామ్ లో ఉన్న అతడు.. విండీస్ తో మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. మిడిలార్డర్ తో పాటు ఫినిషర్ గా రాణిస్తున్న సూర్య లేని లోటును ఎవరు భర్తీ చేస్తారా..? అని ఆసక్తిగా మారింది. దీపక్ హుడా గానీ సంజూ శాంసన్ గానీ ఆ స్థానంలో పంపే అవకాశముంది. ఇదే విషయమై రోహిత్ స్పందిస్తూ.. ‘సూర్య జట్టుకు దూరమవడం బాధాకరమే. అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే సూర్య స్థానాన్ని భర్తీ చేయడానికి పలువురు సమర్థులైన ఆటగాళ్లు కూడా బెంచ్ లో ఉన్నారు. విండీస్ తో సిరీస్ లో గాయపడిన అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను..’ అని అన్నాడు.
వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఫినిషర్ ఉన్నాడు. విండీస్ తో టీ20 సిరీస్ లో అతడు మెరుగైన ప్రదర్శనలు చేశాడు. అతడిని పక్కనబెట్టే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. ఇక స్పిన్నర్ గా రవీంద్ర జడేజా ఎంట్రీ ఇస్తుండటంతో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. బెంచ్ కే పరిమితమయ్యే అవకాశముంది.
బుమ్రాకు ఎదగడానికి మంచి అవకాశం..
ఇక ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆగమనంతో సిరాజ్ కూడా బెంచ్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. బుమ్రాతో కలిసి భువీ పేస్ బాధ్యతలు మోయనున్నాడు. మూడో పేసర్ గా హర్షల్ పటేల్ ను పక్కనబెట్టే సాహసం రోహిత్ చేయకపోవచ్చు. బుమ్రా తిరిగి జట్టులోకి చేరడం, వైస్ కెప్టెన్సీ అప్పగించడం పై హిట్ మ్యాన్ స్పందిస్తూ... ‘వైస్ కెప్టెన్ బౌలరా, బ్యాటరా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. బుమ్రాకు క్రికెటింగ్ నాలెడ్జ్ బాగా ఉంది. మేమిద్దరం కలిసిన ప్రతిసారి క్రికెట్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ కూడా రావడంతో అతడికి కాన్ఫిడెన్స్ లెవల్స్ మరింతగా పెరుగుతాయి..’ అని చెప్పుకొచ్చాడు.
అది గొప్ప ఫీలింగ్..
ఇక తనను టెస్టు సారథిగా నియమించడంపై రోహిత్ శర్మ స్పందించాడు. ఇప్పటికే టీ20, వన్డే లకు సారథిగా ఉన్న హిట్ మ్యాన్ ను సెలెక్షన్ కమిటీ ఇటీవలే టెస్టు కెప్టెన్ గా కూడా నియమించింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మూడు ఫార్మాట్లలో దేశానికి సారథ్యం వహించడం గొప్ప ఫీలింగ్. ఇప్పుడు నా ముంగిట చాలా సవాళ్లున్నాయి. వాటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కుంటానని నమ్ముతున్నా..’ అని హిట్ మ్యాన్ తెలిపాడు.
శ్రీలంకతో సిరీస్ కు భారత టీ20 జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్
