ENG vs IND 2nd ODI: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండో వన్డే లో టాపార్డర్ విఫలమైనా ఆతిథ్య జట్టును   టెయిలెండర్లు ఆదుకున్నారు.  

తొలి వన్డేలో టాపార్డర్ బ్యాటర్లతో పాటు ఈజీగానే తలొగ్గిన టెయిలెండర్లు.. రెండో వన్డేలో మాత్రం అంత త్వరగా వికెట్లు ఇవ్వలేదు. 150 పరుగులకే ప్రధాన బ్యాటర్లంతా ఔటైనా.. మోయిన్ అలీ (64 బంతుల్లో 47.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) డేవిడ్ విల్లీ (49 బంతుల్లో 41..2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు పట్టుదలగా క్రీజులో నిలిచి ఇంగ్లాండ్ కు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. ఫలితంగా ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. భారత పేస్ త్రయంలో షమీ, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ లు ఫర్వాలేదనిపించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు తొలి వన్డేలో మాదిరిగానే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. షమీ, బుమ్రా ల బౌలింగ్ లో ఆడటానికి జేసన్ రాయ్ (33 బంతుల్లో 23.. 2 ఫోర్లు, 1 సిక్సర్), జానీ బెయిర్ స్టో(38 బంతుల్లో 38.. 6 ఫోర్లు) ఇబ్బందిపడ్డారు. కానీ షమీ వేసిన ఐదో ఓవర్లో ఐదోబంతికి జేసన్ రాయ్ సిక్సర్ బాది స్కోరువేగాన్ని పెంచాడు. కానీ హర్ధిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్లో రాయ్.. స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

అయితే ఆ తర్వాత బెయిర్ స్టో ప్రసిధ్ కృష్ణను లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రసిధ్ వేసిన 14 వ ఓవర్లో రెండుఫోర్లు బాదాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న బెయిర్ స్టో ను ఆ తర్వాతి ఓవర్లో చాహల్ బౌల్డ్ చేశాడు.ఇదే ఊపులో చాహల్.. 18వ ఓవర్లో జో రూట్ (21 బంతుల్లో 11)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. 19వ ఓవర్లో రెండో స్పెల్ కు బౌలింగ్ కు వచ్చిన షమీ.. కెప్టెన్ జోస్ బట్లర్ (4) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఇక చాహల్.. 22వ ఓవర్లో బెన్ స్టోక్స్ (21.. 3 ఫోర్లు) ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. ప్రస్తుతం ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ సయమంలో మోయిన్ అలీకి జతకలిసిన లివింగ్ స్టోన్ (33 బంతుల్లో 33.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇంగ్లాండ్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ పాండ్యా బౌలింగ్ లో లివింగ్ స్టోన్ శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 

కానీ మోయిన్ అలీ.. డేవిడ్ విల్లే తో కలిసి ఏడో వికెట్ కు 62 పరుగులు జోడించాడు. టాపార్డర్ ను ముప్పుతిప్పలు పెట్టిన భారత పేసర్లు తోక ను మాత్రం కత్తిరించడంలో చతికిలపడ్డారు. అయితే ప్రమాదరకంగా మారుతున్న మోయిన్ అలీని చాహల్.. 41వ ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత విల్లే కాస్త మెరుపులు మెరిపించాడు. కానీ బుమ్రా 46 ఓవర్లో అతడిని పెవిలియన్ కు చేర్చాడు. ఆతర్వాత ఓవర్లోనే ప్రసిధ్ కూడా.. కార్స్ (2) ను ఔట్ చేశాడు. బుమ్రా 49వ ఓవర్లో టాప్లే ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరదించాడు.

Scroll to load tweet…

భారత బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీయగా హార్ధిక్ పాండ్యా, బుమ్రా 2 వికెట్లు తీశారు.షమీ, ప్రసిధ్ లు తలో వికెట్ తీశారు.