IND vs ENG: ఇండియాతో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. జిమ్మీ ఈజ్ బ్యాక్
England Squad For India test: ఇండియాతో గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన చివరి టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉంది.
రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టును గెలుచుకుని పరువు నిలుపుకునేందుకు గాను ఇంగ్లాండ్ పావులు కదుపుతున్నది. ఈ మేరకు శుక్రవారం నుంచి బర్మింగ్హోమ్ లో ఎడ్జబాస్టన్ వేదికగా ప్రారంభం కాబోయే చివరి టెస్టులో ఆడబోయే జట్టును ప్రకటించింది. 12 మందితో కూడిన ఈ జట్టులో జేమ్స్ అండర్సన్ ఒక్కడు తప్ప పెద్దగా మార్పులేమీ లేవు. న్యూజిలాండ్ తో ఇటీవలే ముగిసిన మూడో టెస్టులో ఆడిన సభ్యులే ఇక్కడా ఆడుతున్నారు.
హెడింగ్లీ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన మూడో టెస్టులో చీలమండ గాయం కారణంగా అండర్సన్ ఆ టెస్టు లో ఆడలేదు. దీంతో అతడి స్థానాన్ని జెమీ ఓవర్టన్ భర్తీ చేశాడు. ఇక అండర్సన్ ఫిట్నెస్ సాధించడంతో అతడు తుది జట్టులోకి రాగా ఓవర్టన్ తప్పుకున్నాడు.
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా గతేడాది జరిగిన నాలుగు టెస్టులలో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ లో నెగ్గి రెండింటిలో ఓడింది. ఒక టెస్టు డ్రా గా ముగిసింది. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ టెస్టును జులై 1 న జరపాలని ఇరుదేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు జట్ల క్రికెటర్లు ఇప్పటికే బర్మింగ్హోమ్ కు చేరుకుని సాధనలో నిమగ్నమయ్యారు.
బెన్ స్టోక్స్ సారథ్యంలో కొత్త హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ మార్గదర్శకత్వంలో ఇంగ్లాండ్ జట్టు మునుపెన్నడూ లేని విధంగా దూకుడుగా ఆడుతున్నది. రూట్, బెయిర్ స్టో, స్టోక్స్, ఓలీ పోప్ లు అరవీర భయంకర ఫామ్ లో ఉన్నారు. టెస్టులను కూడా టీ20 తరహా ఆడుతున్న ఇంగ్లాండ్ ను అడ్డుకోవడం కష్టమే అయినా భారత బౌలింగ్ దళం కూడా అందుకు పూర్తి స్థాయిలో సన్నద్దమై ఉంది.
ఈ టెస్టులో గెలిస్తేనే ఇంగ్లాండ్ కు సిరీస్ ను సమం చేసే అవకాశముంది. డ్రా చేసినా, ఓడినా సిరీస్ గోవిందా. దీంతో కివీస్ తో సిరీస్ మాదిరే అటాకింగ్ గేమ్ ఆడేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నది.
ఇండియాతో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు : అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్) మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్