IPL 2025 PBKS vs DC: ఐపీఎల్ 2025లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్న పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
IPL 2025 PBKS vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో ప్లేఆఫ్స్ చేరిన తర్వాత ఆ టీమ్స్ ఓడిపోతున్నాయి. ఇంతకుముందు ఆర్సీబీని ఎస్ఆర్హెచ్ దెబ్బకొట్టగ్గా, ఈ లిస్టులో పంజాబ్ కింగ్స్ కూడా చేరింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరిన పంజాబ్ కింగ్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.
టాప్ ప్లేస్ కోసం చూస్తున్న శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ టీమ్ కు పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 2 లో చోటుదక్కించుకోవాలని చూసింది. ఈ ఓటమితో ఆ ప్లేస్ ను దక్కించుకోవడం పంజాబ్ కు క్లిష్టంగా మారింది.
ఐపీఎల్ 2025లోని తమ చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు పంజాబ్పై విజయంతో టోర్నీలో తన ప్రయాణం ముగించింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్కి దిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించాడు. అయ్యర్ 34 బంతుల్లో 53 పరుగులు చేసి ఈ సీజన్ లో 5వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఆ తర్వాత మార్కస్ స్టాయినిస్ దుమ్మురేపే ఇన్నింగ్స్తో పంజాబ్ స్కోరు పరుగులు పెట్టించాడు. ఈ ఆస్ట్రేలియన్ స్టార్ 16 బంతుల్లో అజేయంగా 44 పరుగులు సాధించాడు. జోష్ ఇంగ్లిస్ కూడా కీలకంగా 12 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలిచాడు. ఈ ముగ్గురు ఆటగాళ్ల సూపర్ బ్యాటింగ్ తో పంజాబ్ 206 పరుగులు చేసింది.
ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లు తీశాడు. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.
206 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్ (21 బంతుల్లో 35 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (23 పరుగులు) మంచి ఆరంభం అందించారు. డుప్లెసిస్ ఈ మ్యాచ్లో ఐపీఎల్ కెప్టెన్గా 1500 పరుగుల మైలురాయిని అధిగమించి ఈ రికార్డు సాధించిన మూడవ విదేశీ ఆటగాడిగా నిలిచాడు.
కరుణ్ నాయర్ 27 బంతుల్లో 44 పరుగులతో మెరుగైన ఇన్నింగ్స్ ఆడి స్కోరును ముందుకు నడిపించాడు. కానీ ఢిల్లీకి విజయాన్ని అందించాల్సిన బాధ్యత చివరికి సమీర్ రిజ్వీ భుజాన వేసుకున్నారు. ఈ యంగ్ ప్లేయర్ ఐపీఎల్లో తన మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో పాటు ఢిల్లీకి విజయాన్ని అందించాడు. 25 బంతుల్లో 58 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో ఢిల్లీ 2025 సీజన్ను ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ముగించింది.