దుక్కి దున్నుతున్న ధోని.. ఐపీఎల్ కు ముందు పొలంబాట పట్టిన సీఎస్కే సారథి
MS Dhoni: ఐపీఎల్, ఏదైనా క్రీడా సంబంధిత ఈవెంట్లు ఉంటే తప్ప బయటకు రాని ధోని..ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ లలో కూడా పెద్దగా కనిపించడు. కానీ చాలా కాలం తర్వాత ధోని.. ఇన్స్టాలో మెరిశాడు.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రికెటర్ గా అంతర్జాతీయ స్థాయి నుంచి తప్పుకున్నాక ఎక్కువగా రాంచీకి సమీపంలో ఉన్న తన ఫామ్ హౌస్ లోనే గడుపుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్, ఏదైనా క్రీడా సంబంధిత ఈవెంట్లు ఉంటే తప్ప బయటకు రాని ధోని..ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ లలో కూడా పెద్దగా కనిపించడు. కానీ చాలా కాలం తర్వాత ధోని.. ఇన్స్టాలో మెరిశాడు. రిటైర్మెంట్ తర్వాత అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టిన ధోని.. నిన్న అతడు పోస్ట్ చేసిన వీడియోలో కూడా వ్యవసాయం చేస్తూ కనిపించాడు.
తాజా పోస్టులో తాళా (సీఎస్కే అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు).. పొలంలో రైతుగా మారాడు. ట్రాక్టర్తో దుక్కిని దున్ని ఆ తర్వాత దానిని చదునూ చేశాడు. ఇందుకు సంబంధించి ధోని.. వీడియో కూడా పోస్ట్ చేశాడు.
వీడియో పోస్ట్ చేస్తూ ధోని... ‘ఏదైనా కొత్తగా నేర్చుకోవడం చాలా బాగుంటది. కానీ ఇది (దుక్కి దున్నడం) కంప్లీట్ చేయడానికి చాలా టైమ్ పట్టింది..’అని రాసుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలాకాలం తర్వాత ధోని ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ వీడియోపై సీఎస్కే స్పందిస్తూ.. ‘చాలా కాలం తర్వాత తాళా దర్శనం..’అని కామెంట్ చేసింది.
ధోని గతంలో తన ఫామ్ హౌస్ లో పండించిన కూరగాయలు, చెర్రీ పండ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న విషయం తెలిసిందే. వ్యవసాయంతో పాటు ధోని.. పాడి, కోళ్ల పెంపకం కూడా చేపట్టాడు. మెరుగైన పోషకాలు ఉండే కఢక్నాథ్ కోళ్లను ధోని పెంచుతున్నాడు.
ఇక ఐపీఎల్ లో ధోని.. త్వరలోనే మళ్లీ కొత్త సీజన్ ను ఆరంభించబోతున్నాడు. గతేడాది ధోనిది చివరి సీజన్ అని భావించినా 2022లో సీఎస్కే అత్యంత దారుణ వైఫల్యంతో అతడు తన మనసు మార్చుకున్నాడు. ఈ సీజన్ లో మళ్లీ చెన్నైని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించి రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని భావిస్తున్నాడు.