Ambati Rayudu Retirement: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్, ఈ సారి వేలంలో దీపక్ చాహర్ తర్వాత అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన తెలుగు తేజం అంబటి రాయుడు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు..! ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించిన అతడు కొద్దిసేపటికే..
తెలుగు తేజం, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం మహారాష్ట్ర వేదికగా సాగుతున్న సీజన్.. తన ఆఖరి సీజన్ అని ట్వీట్ చేశాడు. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దానిని డిలీట్ చేయడం విశేషం. 2010 లో ఐపీఎల్ కు ఎంట్రీ ఇచ్చిన రాయుడు.. 12 ఏండ్లుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు సేవలందిస్తున్నాడు. అయితే అతడు రిటైర్మెంట్ గురించి ట్వీట్ చేయడం.. దానిని మళ్లీ తీసేయడంతో సీఎస్కే అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ట్విటర్ వేదికగా రాయుడు స్పందిస్తూ..‘ఐపీఎల్ లో ఇది నా ఆఖరు సీజన్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఐపీఎల్ లో గొప్ప జట్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. ఆ రెండు జట్లతో గొప్ప క్షణాలు గడిపాను. ముంబై, సీఎస్కే కు హృదయపూర్వక ధన్యవాదాలు..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
అయితే ట్వీట్ చేసిన పదిహేను నిమిషాయలకే రాయుడు దానిని మళ్లీ డిలీట్ చేయడం అనుమానాలకు తావిస్తున్నది. రాయుడు ఇప్పటివరకు ఐపీఎల్ లో 187 మ్యాచులాడాడు. 29.28 సగటుతో 4,187 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అతడి అత్యధిక స్కోరు 100 నాటౌట్ గా ఉంది.
2010 నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్ తో ఉన్న రాయుడు.. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతున్నాడు. ఈ సీజన్ లో రాయుడు.. 12 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. 27.10 సగటుతో 271 పరుగులు సాధించాడు. ఇందులో ఓ ఫిఫ్టీ కూడా ఉండటం గమనార్హం.
2017 వరకు ముంబై తో ఉన్న రాయుడును 2018లో సీఎస్కే రూ. 2.20 కోట్లతో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి అతడు సీఎస్కే తోనే ఆడుతున్నాడు. 2018, 2021 లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన సీఎస్కే జట్టులో రాయుడు సభ్యుడు. గతేడాది సీఎస్కే ట్రోపీ సాధించడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ ఏడాది చెన్నై.. వేలంలో రాయుడును ఏకంగా రూ. 6.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది రాయుడు ఆశించిన స్థాయిలో రాణించడంలో చతికిలపడుతున్నాడు.