ఐపీఎల్ 2020పై కరోనా దెబ్బ...నో చీర్ లీడర్స్, నో ఫ్యాన్స్
కరోనా భయంతో స్టేడియంలో ప్రేక్షకులకు నో ఎంట్రీ... ఛీర్ లీడర్స్ కూడా లేకుండానే టోర్నీ...
కరోనా వైరస్ కారణంగా సగటు మానవుడి అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయింది. మాస్క్ లేకుండా బయటికి వెళ్లలేని పరిస్థితి. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వీలు లేదు, థియేటర్లో సినిమా ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదు. కరోనా కారణంగా మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ కాస్తా వాయిదా పడి, ఎట్టకేలకు దుబాయ్లో జరగబోతోంది. అయితే కరోనా ప్రభావంతో ఐపీఎల్ రూపరేఖలన్నీ పూర్తిగా మారిపోబోతున్నాయి.
ఐపీఎల్ అంటేనే స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయి ఉంటుంది. తమ ఫేవరేట్ టీమ్ను సపోర్టు చేసేందుకు ఆ జట్టు జెర్సీలు వేసుకుని వచ్చేవాళ్లు ఫ్యాన్స్. ఈలలు, కేకలు, బాణసంచా, డీజే సౌండ్స్... అన్నింటికీ మించి ఫోర్ కొట్టినా, సిక్స్ కొట్టినా డ్యాన్సులతో ఉత్సాహాపరిచే ఛీర్ లీడర్స్... అయితే ఈ సీజన్లో ఇవన్నీ మాయం కాబోతున్నాయి.
అవును ఛీర్ లీడర్స్, ఫ్యాన్స్ లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు జరగబోతున్నాయి. అంతేనా బాల్ స్టేడియంలో ఏ మూల పడినా, ఫీల్డర్లే వెళ్లి తీసుకోవాలి. అంటే ఓ గల్లీ క్రికెట్లా ఐపీఎల్ మారబోతోంది. అయితే క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తోంది ఐపీఎల్ యాజమాన్యం.
స్టేడియంలో ప్రేక్షకుల్లా హోర్డింగులు, కేకలు పెడుతున్నట్టుగా సౌండ్ సెట్టింగులు ఉంటాయని సమాచారం. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ సీజన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.