INDvsPAK: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ లో కూడా దాయాది దేశాల మ్యాచ్ కు అనూహ్య స్పందన వచ్చింది. పురుషుల క్రికెట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్కంఠ కలిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చివరివరకూ పోరాడినా భారత్ నే విజయం వరించింది.
భారత్ - పాక్ మ్యాచ్ అంటే అంచనాలకు కొదవేలేదు. దాయాది దేశాల మధ్య జరిగే ఏ క్రీడలో జరిగే అయినా క్రేజ్ ఉంది. ఇంకా అది క్రికెట్ లో అయితే పీక్స్. పురుషుల క్రికెట్ తో పాటే ఇటీవలి కాలంలో మహిళల విభాగంలో కూడా ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ లో కూడా దాయాది దేశాల మ్యాచ్ కు అనూహ్య స్పందన వచ్చింది. పురుషుల క్రికెట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్కంఠ కలిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చివరివరకూ పోరాడినా భారత్ నే విజయం వరించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి బిస్మా మరూఫ్ (68 నాటౌట్) తో పాటు అయేషా నసీమ్ (43) లు రాణించారు. అనంతరం భారత్ ఛేదనలో తడబడ్డా జెమీమా రోడ్రిగ్స్ (53 నాటౌట్), షఫాలీ వర్మ (33), రిచా ఘోష్ (31) లు రాణించడంతో భారత్ మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
గతేడాది ఆసియా కప్ లో భాగంగా భారత్ పాక్ చేతిలో ఓడింది. ఇప్పుడు ఈ విజయంతో భారత్ బదులు తీర్చుకున్నట్టైంది. అయితే ఉత్కంఠగా ముగిసిన ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. పాక్ క్రికెటర్లతో చాలాసేపు ముచ్చటలాడుతూ గడిపారు. మ్యాచ్ కు సంబంధించిన అంశాలతో పాటు ఇతర విషయాలు మాట్లాడుకున్నారు. ఒకరిని ఒకరు ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. అనంతరం ఒకరితో మరొకరు సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. జెర్సీలను మార్చుకున్నారు.
ఈ వీడియోను ఐసీసీతో పాటు పాకిస్తాన్ క్రికెట్ కూడా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఐసీసీ.. ‘గ్రౌండ్ లోనే పోటీదారులం.. ఆఫ్ ది ఫీల్డ్ కాదు..’అని కామెంట్ చేసింది. పీసీబీ కూడా ‘మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ల మాటా ముచ్చట..’అని షేర్ చేసింది. ఈ రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ మ్యాచ్ లో 93కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో రిచా ఘోష్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివరి నాలుగు ఓవర్లలో 41 పరుగులు రావాల్సి ఉండగా జెమీమా.. రిచాలు అద్భుతమే చేశారు. పాక్ బౌలర్లను ఉతికారేశారు. ఫలితంగా భారత్ ఈ టోర్నీలో విజయ బోణీ చేయడంతో పాటు పాకిస్తాన్ పై టీ20లలో మనకు ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్ లో జెమీమా ఆడిన పలు షాట్లు.. మెల్బోర్న్ లో కోహ్లీ ఆడిన షాట్లతో సరిపోల్చుతూ ఐసీసీ ఓ వీడియోను రూపొందించింది. పాకిస్తాన్ పై టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో భారత్ విక్టరీ అని ట్యాగ్ లైన్ పెట్టి వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
