మళ్లీ బ్యాటు పట్టిన పుజారా, పొలాల మధ్య సాధన షురూ
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్, సౌరాష్ట్ర స్టార్ ఆటగాడు చతేశ్వర్ పుజార కరోనా విరామం అనంతరం బ్యాట్ పట్టుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్, సౌరాష్ట్ర స్టార్ ఆటగాడు చతేశ్వర్ పుజార కరోనా విరామం అనంతరం బ్యాట్ పట్టుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
దీంతో మార్చి ఆఖరు వారం నుంచి క్రికెటర్లు ఇండ్లకే పరిమితం అయ్యారు. నిజానికి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దుతో టీమ్ ఇండియా ఆటగాళ్లు మార్చి రెండో వారం నుంచే ఇండ్లకు పరిమితం అయిపోయారు!.
కరోనా ప్రమాదం కొనసాగుతున్నా క్రికెట్ సీజన్ ఆరంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. స్టేడియాల్లో ప్రాక్టీస్కు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు సైతం ఇచ్చాయి. దీంతో కొంతమంది క్రికెటర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు.
సౌరాష్ట్ర స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజార సైతం తాజాగా ప్రాక్టీస్ మొదలెట్టాడు. సొంతూరు రాజ్కోట్లో పొలాల మధ్య పుజార ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ' క్రికెట్ మొదలెట్టాను. తొలుత ఎంతో విరామం వచ్చిందనే భావన ఉండేది. కానీ క్రీజులో స్టాన్స్ తీసుకోగానే నిన్ననే ఆడిన భావన కలుగుతోంది' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.
ఇకపోతే.... కళంకిత క్రికెటర్, కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్ మళ్లీ మైదానంలో మెరువనున్నాడు. కేరళ జట్టు ప్రకటించిన రంజీ ప్రాబబుల్స్ లో శ్రీశాంత్ కి చోటు దక్కింది. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్, న్యాయస్థానంలో సుదీర్ఘ పోరాటం అనంతరం నిషేధాన్ని ఏడేండ్లకు కుదించుకోగలిగాడు.
శ్రీశాంత్పై బీసీసీఐ నిషేధంఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనున్నది. దీంతో 37 ఏండ్ల శ్రీశాంత్ రంజీ ట్రోఫీలో పునరాగమనానికి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిలిచిపోయింది. దేశవాళీ సీజన్ ఆరంభంపై ఎవరికీ స్పష్టత లేదు. అయినా, ముందుస్తు సన్నాహాల్లో భాగంగా కేరళ క్రికెట్ సంఘం ఆ రాష్ట్ర రంజీ జట్టు ప్రాబబుల్స్ జాబితాను సిద్ధం చేసింది. ఇందులో శ్రీశాంత్ కి చోటు దక్కింది.