అఫ్గాన్తో సిరీస్ వాయిదా..! నెల రోజుల దాకా నో క్రికెట్... ఆ మూడు జట్లతో ట్రై సిరీస్ పెట్టించాలంటున్న ఫ్యాన్స్
ఈ ఏడాది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమైతే ఇండియా - ఆఫ్గాన్ సిరీస్ లేదు. కానీ అఫ్గాన్ క్రికెట్ బోర్డు కోరిక మేరకు టీమిండియా అందుకు అంగీకారం తెలిపినా ఇప్పుడు మళ్లీ అది వాయిదాపడింది..!
టీమిండియా రేపటి నుంచి ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఆడబోతుంది. ఇదే ఆసీస్తో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్ తో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు ఇప్పుడు మళ్లీ కంగారూలతో పోరు ముగిసినాక సుమారు నెల రోజుల పాటు ఖాళీగానే ఉండనున్నారు. జూన్ లో అఫ్గానిస్తాన్ తో జరగాల్సిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ వాయిదాపడ్డట్టు తెలుస్తున్నది.
వాస్తవానికి ఈ ఏడాది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమైతే ఇండియా - ఆఫ్గాన్ సిరీస్ లేదు. కానీ అఫ్గాన్ క్రికెట్ బోర్డు కోరిక మేరకు టీమిండియా జూన్ మూడో వారంలో ఆ జట్టుతో మూడు వన్డేలు లేదా టీ20 మ్యాచ్ లతో ఓ సిరీస్ ఆడుతుందని వార్తలు వచ్చాయి.
కానీ తాజా నివేదికల ప్రకారం.. ఈ సిరీస్ వాయిదాపడిందని సమాచారం. కారణాలింకా తెలియరాలేదుగానీ ఇండియా - అఫ్గాన్ సిరీస్ అయితే జరిగేది లేదని తెలుస్తున్నది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రోహిత్ సేనకు మంచి విశ్రాంతి దొరికినట్టే. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత భారత జట్టుకు నెల రోజుల పాటు విరామం దొరకనుంది. జులై రెండో వారంలో భారత జట్టు వెస్టిండీస్ తో టెస్టు మ్యాచ్ ఆడేదాకా భారత ఆటగాళ్లకు విశ్రాంతి దొరికినట్టే..
ఇంకా పూర్తి షెడ్యూల్ ఖరారు కాని ఈ టూర్ లో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నట్టు సమాచారం. అంటే భారత జట్టు జులై మొదటివారంలో కరేబియన్ దీవులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే నెల రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ లు లేకుండా ఉండటాన్ని క్రికెట్ లవర్స్ తట్టుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ లో మోస్ట్ పాపులర్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముక్కోణపు సిరీస్ నిర్వహించాలని బీసీసీఐని కోరుతున్నారు. మరికొందరు.. ‘వామ్మో నెల రోజుల పాటు మ్యాచ్ లు లేకుండా ఉండాలా..? ఇది ఆటగాళ్లకు మంచిదేనేమో గానీ ఫ్యాన్స్ కు అయితే ఎంత మాత్రమూ కాదు..’అని కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.