పెద్ద ప్లానింగే ఇది..! ఇండియాకు రావడానికి ముందు సఫారీ జట్టుకు ప్రత్యేక ట్రిప్.. కారణమిదే..
South Africa Tour Of India: ఈ ఏడాది రెండోసారి భారత పర్యటనకు వచ్చింది దక్షిణాఫ్రికా జట్టు. ఇప్పటికే జూన్ లో టీ210 సిరీస్ ఆడిన సపారీలు.. మళ్లీ ఇప్పుడు టీ20లతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనున్నారు.
టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు గాను దక్షిణాఫ్రికా జట్టు శనివారమే భారత్కు చేరుకుంది. తొలి టీ20 జరగాల్సి ఉన్న తిరువనంతపురంలో మ్యాచ్ ఆడేందుకు గాను సఫారీ ఆటగాళ్లు శనివారం త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అయితే సౌతాఫ్రికా జట్టు ఇండియా పర్యటనకు రావడానికి కొద్దిరోజుల ముందే ఓ స్పెషల్ ట్రిప్ కు వెళ్లొచ్చింది. సఫారీ కెప్టెన్ టెంబ బవుమా, కోచ్ మార్క్ బౌచర్ లు.. జట్టు ఆటగాళ్లందరితో కలిసి అక్కడికి వెళ్లొచ్చారు.
ఇంతకీ సఫారీ ఆటగాళ్లంతా వెళ్లింది ఎక్కడికనుకుంటున్నారా..? రాబెన్ ఐలండ్కు. ఇది సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దీవి. నార్త్ కేప్టౌన్ లో ఉన్న బ్లూబర్గస్ట్రండ్ తీరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దీవి. జట్టును ఇక్కడకు తీసుకెళ్లిన బవుమా.. వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.
ఇది చూడటానికి ఒక దీవి అయినా 20వ శతాబ్దం ప్రారంభం వరకు దీనిని రాజకీయ ఖైదీలను బందించే జైలుగా వాడేవారు. స్వేచ్ఛా సంకెళ్లు తెంపుకోకముందు దాకా దక్షిణాఫ్రికా ‘నల్ల సూరీడు’ నెల్సన్ మండేలా ను ఇక్కడ ఉన్న జైలులోనే బందించారు. నాటి బ్రిటీష్ కాలం నుంచి 20వ శతాబ్ది ప్రారంభం దాకా జైలుగానే ఉన్నా.. కానీ తదనంతర కాలంలో ఇక్కడ జైలును తొలగించి పర్యాటకంగా అభివృద్ధి చేశారు. రాబెన్ ఐలండ్ ను ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించారు.
రాబెన్ ఐలండ్ చరిత్ర :
ఆఫ్రికా ఖండాన్ని ఆంగ్లేయులు, డచ్ పరిపాలిస్తున్న కాలంలోనే దీనిని కనుగొన్నారు. 13, 14వ శతాబ్దంలో పోర్చుగ్రీస్ నావిగేషన్ సెంటర్ గా దీనిని ఉపయోగించారు. తర్వాత ఇక్కడికి వలస వచ్చిన పోర్చుగ్రీసు వాళ్లు ఈ దీవిలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. అయితే అప్పటికీ దానికి జైలుగా వాడలేదు. 16వ శతాబ్దంలో ఇక్కడికి వలస వచ్చిన పోర్చుగ్రీసు ప్రజలు స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ దొరికే సహజ వనరులతో వాళ్లు జీవనం కొనసాగించేవారు.
కానీ 17వ శతాబ్దం చివరి నుంచి ఇది ప్రధానంగా రాజకీయ ఖైదీలను ఖైదు చేయడానికే ఉపయోగపడింది. డచ్ వలసవాదులు ఈ ద్వీపాన్ని జైలుగా వాడారు. తమకు ఎదురు తిరిగిన నాయకులు, సామాజిక కార్యకర్తలను ఇక్కడ పడేసేవారు. ఇండియాకు అండమాన్ జైలు ఎలాంటిదో సౌతాఫ్రికా కు రాబెన్ ఐలండ్ కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. ఈ జైలులో నెల్సన్ మండేలాను 1964 నుంచి 1982 వరకు బందీగా ఉంచారు. ఆ తర్వాత ఆయనను కేప్ టౌన్ లోని మరో జైలుకు తరలించారు.
ఇక్కడికే ఎందుకు..?
20 వ దశాబ్దం ప్రారంభం వరకు రాబెన్ ఐలండ్ ను జైలుగానే ఉంచినా తర్వాత దానిని తొలగించి ఆ జైలును మ్యూజియంగా మార్చారు. ఇక్కడ ప్రతీ గదిలోనూ ఆఫ్రికా ఖండం విముక్తి కోసం పోరాడిన యోధుల కథలున్నాయి. దాని నుంచి స్ఫూర్తి పొందడానికి గాను బవుమా, బౌచర్ లు ఇక్కడికి స్పెషల్ ట్రిప్ వేశారు.
టీమిండియాతో పాటు రాబోయే ప్రపంచకప్ లో సౌతాఫ్రికా రాణించేందుకు గాను ఈ యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని బవుమా నమ్ముతున్నాడు. ఇదే విషయమై అతడు మాట్లాడుతూ.. ‘ఈ యాత్ర మాలో స్ఫూర్తి నింపింది. నేను నా 8 ఏండ్ల వయసులో ఇక్కడికి వచ్చా. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే వచ్చాను. ఇక్కడికొస్తే కొత్త స్ఫూర్తి నాలో రగులుతుంది. గత మూడు నెలలుగా నేను గాయం వల్ల క్రికెట్ ఆడలేదు. తిరిగి ఫామ్ ను అందుకోవడానికి నాతో పాటు నా జట్టు సహచరులకు కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుంది..’ అని తెలిపాడు.