భారత్‌లో రోజువారీ కొత్త కోవిడ్-19 కేసులు లక్షకు చేరువ అవుతుండగా బీసీసీఐ వర్గాలు క్రికెటర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్ విషయంలో పునరాలోచనలో పడింది. ఐపీఎల్‌ ఆతిథ్య నగరాల్లో ఒకటైన ముంబయి రోజుకు సుమారు పది వేల కొత్త కేసులు నమోదు చేస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది

భారత్‌లో రోజువారీ కొత్త కోవిడ్-19 కేసులు లక్షకు చేరువ అవుతుండగా బీసీసీఐ వర్గాలు క్రికెటర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్ విషయంలో పునరాలోచనలో పడింది. ఐపీఎల్‌ ఆతిథ్య నగరాల్లో ఒకటైన ముంబయి రోజుకు సుమారు పది వేల కొత్త కేసులు నమోదు చేస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది.

ముంబయిలో బయో బబుల్‌లో సాధన చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పాజిటివ్‌ తేలాడు. దీంతో క్రికెటర్లకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేసేందుకు బోర్డు అడుగులు వేస్తోంది.

ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌, బీసీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ' కరోనా మహమ్మారి బెడద నుంచి తప్పించుకునే ఏకైక మార్గం వ్యాక్సిన్ తీసుకోవటం. క్రికెటర్లు కచ్చితంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది.

ఈ పరిస్థితి ఎంత కాలం ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అందుకే క్రికెటర్లకు వ్యాక్సినేషన్‌పై పరిశీలిస్తున్నాం. క్రికెటర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదించాలని అనుకుంటున్నాం.

ఐపీఎల్ ఆతిథ్య నగరాలపై బీసీసీఐ పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ హైదరాబాద్‌, ఇండోర్‌లు ప్రత్యామ్నాయ వేదికలుగా ఉన్నాయి. ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం తెలుసు, బీసీసీఐకి ఆటగాళ్ల భద్రత అత్యంత ముఖ్యం' అని రాజీవ్‌ శుక్లా తెలిపారు.