India Tour Of West Indies: డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు నెల రోజుల పాటు ఖాళీగానే ఉండనుంది. జులై 12 నుంచి వెస్టిండీస్ తో మూడు ఫార్మాట్ల సిరీస్కు తెర లేవనుంది.
భారీ ఆశలతో ఇంగ్లాండ్ వెళ్లిన భారత క్రికెట్ జట్టు మరోసారి ఐసీసీ ట్రోఫీ లేకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆసీస్తో ఓడిన తర్వాత భారత జట్టు ఇక తర్వాత ఆడబోయే మ్యాచ్ లపై దృష్టి సారించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా తర్వాత ఆడబోయే షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. నెల రోజుల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది.
ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడనుంది. జులై 12 నుంచి మొదలయ్యే ఫస్ట్ టెస్టుతో భారత పర్యటన మొదలవుతుంది. ఆగస్టు 13న జరిగే చివరి టీ20తో పర్యటన ముగుస్తుంది.
షెడ్యూల్ ఇదీ..
జులై 12-16 : తొలి టెస్టు - డొమినికా
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్
జులై 27 : తొలి వన్డే - బార్బోడస్
జులై 29 : రెండో వన్డే - బార్బోడస్
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 3 : తొలి టీ20 - ట్రినిడాడ్
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్)
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా
కొద్దిరోజుల క్రితమే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. షెడ్యూల్ ను బీసీసీఐకి పంపగా అందులో పలు మార్పులు చేసి అంగీకారం తెలిపింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ (2023 - 2025) ను టీమిండియా.. విండీస్ సిరీస్ తోనే ఆరంభించనుంది. మూడు ఫార్మాట్లకు ప్రకటించబోయే జట్లలో పలువురు సీనియర్లను పక్కనబెట్టి ఐపీఎల్ వీరులను ప్రోత్సహించే అవకాశాలున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
బ్రాడ్కాస్టర్లు వీళ్లే..
బీసీసీఐతో ప్రముఖ ఛానెల్ స్టార్ ఒప్పందం కొద్దిరోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో ఇండియా - వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ లకు కొత్త బ్రాడ్కాస్టర్ రానుంది. ఈ మ్యాచ్ లను టెలివిజన్ లో చూడాలనుకునేవారికి బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. డీడీ స్పోర్ట్స్ లో ఉచితంగా ఇండియా - వెస్టిండీస్ సిరీస్ ను చూడొచ్చు. మొబైల్ లో చూడాలనుకునేవారికి కూడా జియో తీపి కబురు అందించింది. ఐపీఎల్ మాదిరిగానే విండీస్ సిరీస్ లోని మ్యాచ్ లను జియో సినిమా ఉచితంగా అందిస్తోంది. ఈ మ్యాచ్ లను చూసేందుకు ఏ సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. వాస్తవానికి విండీస్j కు అధికారిక బ్రాడ్కాస్టర్ ‘ఫ్యాన్ కోడ్’ ఉంది. ఇందులో డబ్బులు పెట్టి సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. గతేడాది భారత జట్టు విండీస్ టూర్ లో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కున్న నేపథ్యంలో బీసీసీఐ ఈసారి తగు జాగ్రత్తలు తీసుకున్నది.
