న్యూజిలాండ్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. ముంబై వేదికగా టీ20 పండుగ
INDvsNZ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో క్రమం తప్పకుండా క్రికెట్ ఆడుతన్నది. భారత పురుషుల క్రికెట్ జట్టుతో పాటు జూనియర్ స్థాయిలో కూడా మ్యాచ్ లు జరుగుతూనే ఉన్నాయి.
భారత్ - న్యూజిలాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో పాటు కివీస్ తో భారత క్రికెట్ బోర్డు వరుసగా సిరీస్ లు ఏర్పాటు చేస్తున్నది. సీనియర్లతో పాటు జూనియర్ స్థాయిలలో కూడా సిరీస్ లను నిర్వహిస్తూ క్రికెట్ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఒకవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడుతుండగా మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కూడా కివీస్ తో స్వదేశంలో సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అండర్-19 స్థాయిలో జరిగే ఈ సిరీస్ షెడ్యూల్, జట్టు వివరాలను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
న్యూజిలాండ్ అండర్ -19 మహిళల క్రికెట్ జట్టు ఈనెల 27 నుంచి భారత్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ మేరకు ఆలిండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ఇండియా అండర్-19 జట్టును ప్రకటించింది. శ్వేతా సెహ్రావత్ సారథిగా ఉన్న ఈ జట్టుకు సౌమ్య తివారి వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది.
ఇండియా అండర్ - 19 జట్టు : శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), శిఖా షలోట్, త్రిషా.జి, సౌమ్యా తివారి, సోనియా మెహ్దియా, హర్లీ గల, హృషితా బసు (వికెట్ కీపర్), నందిని కశ్యప్ (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, ప్రశవి చోప్రా, టిటాస్ సధు, పలక్ నాజ్, ఎండీ షబ్నమ్
ఇండియా, న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్ :
- నవంబర్ 27 : తొలి టీ20
- నవంబర్ 29 : రెండో టీ20
- డిసెంబర్ 01 : మూడో టీ20
- డిసెంబర్ 04 : నాలుగో టీ20
- డిసెంబర్ 06 : ఐదో టీ20
- మ్యాచ్ లన్నీ ముంబైలోని ఎంసీఎ బీకేసీ స్టేడియంలో జరుగుతాయి.
ఈ సిరీస్ కంటే ముందే న్యూజిలాండ్ అండర్-19 జట్టు.. వెస్టిండీస్ అండర్ - 19 జట్టుతో రెండు టీ20లు ఆడనుంది.
నవంబర్ 22న తొలి టీ20, 24న రెండో టీ20 ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.