హెచ్ సీఏలో.. ఐపీఎల్ ఎఫెక్ట్... శివలాల్ కి అజహర్ సవాల్
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హెచ్సీఏ మాజీ కార్యదర్శి శివలాల్యాదవ్.. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ ఏడాది ఐపీఎల్ సందడి త్వరలో ప్రారంభం కానుంది. కాగా.. ఈ ఐపీఎల్ నిర్వహించడానికి ఇప్పటికే వేదికలను కూడా కన్ఫామ్ చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబయిలోనూ నిర్వహిస్తున్నారు.. కానీ.. హైదరాబాద్ కి మాత్రం చోటు దక్కలేదు.
కాగా.. ఐపీఎల్ మ్యాచ్ల ఆతిథ్యం దక్కకపోవడం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో మంటలు రేపుతోంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హెచ్సీఏ మాజీ కార్యదర్శి శివలాల్యాదవ్.. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఉప్పల్ స్టేడియానికి ఐపీఎల్ మ్యాచ్లు కేటాయించకపోవడంపై శివలాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెచ్సీఏకు ఇది సిగ్గుచేటు అని ధ్వజమెత్తాడు.
"ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణలో ఏకంగా నాలుగు సీజన్లలో హైదరాబాద్ అత్యుత్తమ మైదానం అవార్డు అందుకుంది. కోవిడ్-19 పరిస్థితుల్లో బయో సెక్యూర్ బబుల్ సృష్టికి ప్రపంచ స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, హైదరాబాద్కు ఐపీఎల్ మ్యాచులు కేటాయించక పోవటానికి హెచ్సీఏ ఆఫీస్ బేరర్ల నిర్లక్ష్యమే కారణమని మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు (తాత్కాలిక) ఎన్. శివలాల్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ' ఐపీఎల్ మ్యాచులకు హైదరాబాద్ వేదిక కాకపోవటం సిగ్గుచేటు. ఆతిథ్య నగరాల్లో హైదరాబాద్ లేకపోవట బాధించింది."
"హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్కు చిత్తశుద్ధి లేదు. హైదరాబాద్ను ఎందుకు ఐపీఎల్ ఆతిథ్య నగరంగా ఎంచుకోవాలో అతడు బీసీసీఐ ఉన్నతాధికారులకు బలమైన కారణాలతో వివరించి ఉండాల్సింది. ఐపీఎల్ ఆతిథ్యానికి హైదరాబాద్కు అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ.. హెచ్సీఏ పాలక మండలిలో కుమ్ములాటలు నష్టం చేకూర్చాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులు అపహాస్యం అవుతుంటే, బీసీసీఐ నుంచి ఇటువంటి వైఖరే ఎదురవుతుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అభివృద్ధికి సమయం కేటాయించే తీరిక లేనప్పుడు ఆసీస్ బేరర్లుగా బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు? అధ్యక్షుడు సహా అందరూ తక్షణమే రాజీనామా చేసి ఎన్నికలు నిర్వహించండి. అంతర్గత కుమ్ములాటలు హైదరాబాద్ క్రికెట్ను చంపేస్తున్నాయి' అని శివలాల్ యాదవ్ విమర్శించారు.
కాగా.. దీనికి అజహర్ కౌంటర్ ఇచ్చారు. అజహరుద్దీన్ను అయినంత మాత్రాన నేను అన్నీ అద్భుతాలు చేస్తానని కాదు. ఐపీఎల్ షెడ్యూల్, వేదికల ఖరారు విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఐపీఎల్ మ్యాచులకు హైదరాబాద్ను వేదిక చేసే విషయమై బీసీసీఐ ఉన్నతాధికారులతో మాట్లాడాను. అయినా, హైదరాబాద్ ఆతిథ్య నగరాల జాబితాలో లేదనే సమాధానమే వచ్చింది."
"ఐపీఎల్ మ్యాచులను హైదరాబాద్కు కేటాయించకపోవటానికి అధికారిక కారణం ఏమిటనే విషయం నాకు తెలియదు. అది భారత క్రికెట్ బోర్డుకే తెలియాలి. కానీ, ఇతర ఆతిథ్య నగరాల్లో ఎక్కడ సమస్య తలెత్తినా ఐపీఎల్ మ్యాచులు హైదరాబాద్కు కేటాయిస్తారనే అనుకుంటున్నాను. ఐపీఎల్ మ్యాచులను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు నా శక్తి మేరకు ప్రయత్నించాను. ఐపీఎల్ తుది షెడ్యూల్ ఖరారుకు ముందు సైతం బీసీసీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం గత పాలకులు చేసిన పనులకు హెచ్సీఏ మూత పడాల్సింది. గత బకాయిలు, అప్పులను ప్రస్తుత పాలక మండలి తీర్చుకుంటూ వస్తోంది. మార్చి 28న నిర్వహించే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో ప్రస్తుత సమస్యలకు పరిష్కారం లభించనుంది. క్రికెట్ సలహా సంఘం, సీఓఏ, సెలక్షన్ కమిటీలు, సీఈవో, సీఎఫ్ఓ నియామకాలు ఏజీఎంలో చేపడతాం. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు సంపూర్ణ సహకారం, మద్దతు అందించిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కృతజ్ఞతలు" అని అజర్ స్పందించారు.