Asian Champions Trophy: పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన భారత్.. ఉత్కంఠ పోరులో మనదే గెలుపు..
India Vs Pakistan: ఈ ట్రోఫీలో టేబుల్ టాపర్ గా ఉన్న భారత్.. మంగళవారం జపాన్ తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాక్ ను ఓడించింది.
ఢాకా వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్షిప్ హాకీ ట్రోఫీలో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించింది. దాయాదులపై గెలిచిన భారత హాకీ జట్టు.. కాంస్యం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో టీమిండియా.. 4-3 తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఈ ట్రోఫీలో టేబుల్ టాపర్ గా ఉన్న భారత్.. మంగళవారం జపాన్ తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే.. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత జట్టు.. పాకిస్థాన్ తో పోటీ పడింది. కాంస్యం కోసం ఇరు జట్లు హోరాహోరిగా పోరాడినా భారత్ నే విజయం వరించింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్, అక్షదీప్సింగ్, వరుణ్ కుమార్, గుర్సాహిబిజిత్ సింగ్ లు గోల్స్ చేశారు. పాక్ తరఫున అర్ఫ్రాజ్, అబ్దుల్ రాణా, అహ్మద్ నదీమ్ లు గోల్స్ కొట్టారు.
ఆధ్యంతం ఉత్కంఠంగా జరిగిన మ్యచులో భారత ఆటగాళ్లు తొలి నుంచే దూకుడా ఆడారు. తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్.. 1-0 ఆధిక్యంతో నిలిచింది. అయితే ఈ క్రమంలో పాక్ పుంజుకుంది. మ్యాచ్ పదో నిమిషంలో అర్ఫ్రాజ్ గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. మూడో క్వార్టర్ ప్రారంభంలోనే పాక్ ఆటగాడు అబ్దుల్ మరో గోల్ కొట్టాడు. దీంతో పాకిస్థాన్ 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లింది.
అయితే మ్యాచ్ 45వ నిమిషం వద్ద భారత ఆటగాడు సుమిత్ గోల్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత 53వ నిమిషంలో వరుణ్ కుమార్, 57వ నిమిషంలో ఆకాశ్ దీప్ లు వరుస గోల్స్ సాధించి భారత్ ను 4-2 ఆధిక్యానికి తీసుకెళ్లారు.
ఇక మ్యాచ్ ముగుస్తుందనగా పాక్ అహ్మద్ నదీమ్ మరో గోల్ చేశాడు. అయినా అది పాక్ భారత ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే గానీ ఓటమిని మాత్రం ఆపలేదు. దీంతో చివరికి భారత్ 4-3 తో విజయాన్ని నమోదు చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. లీగ్ దశలో కూడా భారత్.. పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.