Asia Cup 2023: పాక్కు షాక్.. ఆసియా కప్లో హైబ్రిడ్ మోడల్ను తిరస్కరించిన ఆ మూడు దేశాలు..
Asia Cup 2023: గత కొన్నిరోజులుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రమే వ్యతిరేకించిన హైబ్రిడ్ మోడల్ ను ఇప్పుడు ఏసీసీలోని ఇతర సభ్య దేశాల కూడా తిరస్కరించినట్టు సమాచారం.
ఆసియా కప్ - 2023 పాకిస్తాన్ నుంచి తరలిపోయేందుకు రంగం సిద్దమైంది. గత కొన్నిరోజులుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రమే వ్యతిరేకించిన హైబ్రిడ్ మోడల్ (భారత్ మ్యాచ్లు తటస్థ వేదికపై.. ఇతర మ్యాచ్లు పాకిస్తాన్లో) ను తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) లోని సభ్య దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కూడా వ్యతిరేకించాయని తెలుస్తున్నది. తాము కూడా హైబ్రిడ్ మోడల్ కు వ్యతిరేకమని తేల్చి చెప్పాయి. నిన్నటిదాకా బీసీసీఐ మద్దతు లేకున్నా ఎలాగోలా లంక, బంగ్లాదేశ్, అఫ్గాన్ ల మద్దతుతో ఆసియా కప్ ను నిర్వహించేందుకు శతవిధాలా ప్రయత్నించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఇది ఊహించని షాక్.. దీంతో పీసీబీ ఈ టోర్నీని నిర్వహించే అవకాశం పూర్తిగా కోల్పోయినట్టే. మరి శ్రీలంకలో ఈ టోర్నీని నిర్వహిస్తారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆడేందుకు పాకిస్తాన్ సమ్మతిస్తుందా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
గతేడాది టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తే తాము పాల్గొనేది లేదని.. తటస్థ వేదిక అయితే ఆడతామని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పీసీబీ.. ఏసీసీ ఒత్తిడికి తలొగ్గి హైబ్రిడ్ మోడల్ ను తీసుకొచ్చింది.
హైబ్రిడ్ మోడల్ ప్రకారం.. ఆసియా కప్ - 2023 లో భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో గానీ శ్రీలంకలో గానీ నిర్వహించాలని పీసీబీ తో పాటు ఏసీసీ సభ్యదేశాలు అంగీకారానికి వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ గడిచిన నెల రోజులుగా ఈ విధానాన్ని కూడా బీసీసీఐ తిరస్కరించింది. సెప్టెంబర్ లో యూఏఈలో ఎండలు ఎక్కువగా ఉంటాయనే కారణంగా ఈ విధానానికి స్వస్తి పలికింది.
ఇటీవలే ఐపీఎల్ - 16 ఫైనల్స్ లో భాగంగా అహ్మదాబాద్ కు వచ్చిన లంక, బంగ్లా, అఫ్గాన్ క్రికెట్ బోర్డుల అధ్యక్షులతో జై షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే బీసీసీఐ.. ఏసీసీలోని సభ్యదేశాలను తమ వైపునకు తిప్పుకుందని పీసీబీ కూడా ఆరోపించింది. ఆసియా కప్ ను లంకలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కూడా వార్తలు రావడంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే జరిగితే తాము లంకతో జులైలో జరుగబోయే రెండు టెస్టులు, వన్డే సిరీస్ మ్యాచ్ లపై పునరాలోచిస్తామని హెచ్చరించింది. పీసీబీ ఎన్ని బెదిరింపులకు దిగినా ఏసీసీ సభ్యదేశాలు మాత్రం హైబ్రిడ్ మోడల్ కు తాము అంగీకారం కాదని తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక ఏసీసీ సభ్య దేశాలు ఇదే మాట మీద ఉంటే అది పీసీబీకి భారీ షాక్ ఇచ్చినట్టే. ఇది ఇక్కడితో అయితే ఆగేది కాదు. వచ్చే అక్టోబర్ లో భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ ఆడుతుందా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.