కొలంబోలో జరగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్పై ఆసక్తి చూపించని క్రికెట్ ఫ్యాన్స్... దాదాపు ఖాళీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ..
క్రికెట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. కేవలం ఇరు దేశాల ఫ్యాన్స్ మాత్రమే కాకుండా క్రికెట్ చూసే ప్రతీవాళ్లు ఇండియా - పాక్ మ్యాచ్ని స్టేడియంలో చూడాలనుకుంటారు... అలాంటిది సూపర్ 4 రౌండ్లో భాగంగా కొలంబోలో జరగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి ఫ్యాన్స్ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు...
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్పై క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీనిపై పాక్ మాజీ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ స్పందించాడు. ‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి ఫ్యాన్స్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడూ చూడలేదు. దాదాపు ఖాళీ స్టేడియం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్కి ఓ దండం’ అంటూ ఓ ఎమోజీ పోస్ట్ చేశాడు మహ్మద్ హఫీజ్..
కొలంబో వాతావరణం...
కొలంబోలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్కి రిజర్వు డే కూడా కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. వర్షం కారణంగా కొలంబోలో నగరవీధులన్నీ జలమయమయ్యాయి..
కొలంబోవాసులు, భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ చూసేందుకు వాళ్లు ఆసక్తి చూపించలేదు. గ్రూప్ స్టేజీలో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కావడం కూడా సూపర్ 4 మ్యాచ్పై ప్రభావం చూపించింది.
దెబ్బేసిన హైబ్రీడ్ మోడల్...
పాకిస్తాన్లో లేదా ఇండియాలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే స్టేడియం బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాల్లో కూడా ప్రవాస భారతీయులు, పాకిస్తానీలు ఎక్కువ.
అయితే శ్రీలంకలో భారత్, పాక్ దేశాల ప్రజలు చాలా తక్కువ... దీంతో కొలంబోలో ఇండియా- పాక్ మ్యాచ్ చూసేందుకు చాలా తక్కువ మంది మాత్రమే దేశ సరిహద్దులు దాటి, అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు..
వన్డే వరల్డ్ కప్...
అక్టోబర్లో ఇండియా - పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్లో మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 14న జరిగే ఈ మ్యాచ్కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వరల్డ్ కప్ మ్యాచ్ చూసే ముందు, ఆసియా కప్ మ్యాచ్పై ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు.
టికెట్ ధరలు..
కొలంబోలో శ్రీలంక- బంగ్లాదేశ్ మ్యాచ్కి జనాల నుంచి అద్భుత స్పందన వచ్చింది. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. కారణం శ్రీలంక లోకల్ టీమ్ కావడం మాత్రమే కాదు, టికెట్ల ధరలు కూడా ఓ కారణం. శ్రీలంక- బంగ్లాదేశ్ మ్యాచ్కి కనీస టికెట్ ధరకు టికెట్లను విక్రయించిన లంక క్రికెట్ బోర్డుకి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి మూడింతలు ఎక్కువ ధరను నిర్ణయించింది. ఈ భారీ టికెట్ ధరల వల్ల కూడా లోకల్ జనాలు, మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రాలేదు..
