ఆర్టికల్ 370 రద్దు...కశ్మీరీ పండిత్ క్రికెటర్ రైనా ఏమన్నాడంటే
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కశ్మీరీ పండిత్ కుటుంబానికి చెందిన క్రికెటర్ సురేష్ రైనా స్వాగతించాడు.
ఉగ్రవాదుల కార్యకలాపాలకు నిలయంగా మారిన జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల ఏరివేతకు అడ్డుగా నిలుస్తున్న నిబంధనలను రద్దు చేసింది. ఆ రాష్ట్రానికి రాజ్యాంగబద్దంగా కల్పించిన ఆర్డికల్ 370, కశ్మీరీ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పించే 35ఏ ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సోమవారం సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ యావత్ దేశ ప్రజలతో పాటు కశ్మీరీ పండిత్ లు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
కశ్మీరీ పండిత్ కుటుంబానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ సురేష్ రైనా కేంద్ర నిర్ణయంపై స్పందించాడు. '' ఆర్టికల్ 370 రద్దుచేయడం చారిత్రాత్మక నిర్ణయం. దీని ద్వారా ఎప్పుడూ అల్లకల్లోకంగా వుండే జమ్మూ కశ్మీర్ శాంతి ఏర్పడుతుందని బావిస్తున్నాను. భవిష్యత్ లో కశ్మీర్ అభివృద్దితో పాటు ప్రజలు స్వేచ్చగా జీవించే వెసులుబాటు లభిస్తుంది.'' అంటూ ట్విట్ చేశాడు.
కశ్మీరీ పండిత్ కుటుంబంలో పుట్టిపెరిగిన సురేష్ రైనాకు కశ్మీర్ సమస్యల గురించి బాగా అవగాహన వుంది. దీంతో అతడు కశ్మీర్ లో ఉగ్రవాద సమస్య, రాష్ట్రంలోని ప్రజల హక్కుల గురించి చాలాసార్లు స్పందించాడు. గతేడాది ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఓ కశ్మీర్ పండిత్ మహిళ భారత్ మాతాకి జై...జై హింద్ అంటూ నినదించింది. ఇలా ఉగ్రమూకలకు భయడకుండా దేశంభక్తిని ప్రదర్శించిన ఆమెను రైనా సాల్యూట్ చేస్తూ అభినందించాడు.
రైనా తండ్రి కశ్మీరీ పండిత్ కాగా తల్లి హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు. గతంలో వీరి కుటుంబం శ్రీనగర్ లో నివసించేవారు. అయితే కశ్మీర్ పండిత్ కుటుంబాలపై దాడులు జరుపుతూ కొన్ని అల్లరిమూకలు కశ్మీర్ లో హింసను ప్రేరేపించాయి. దీంతో రైనా తండ్రి తన కుటుంబంతో సహా సొంత రాష్ట్రాన్ని వీడి ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ కు వలస వెళ్లాడు. ఇలా రైనా యూపీ క్రికెటర్ గా మారాడు.