కొమురం భీముడితో టీమిండియా స్టార్లు... ఫోటోలు వైరల్.. ఇక కివీస్ కు ‘నాటు నాటు’ స్టెప్పులే...!
INDvsNZ: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆడేందుకు గాను భాగ్యనగరానికి వచ్చిన టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
గతేడాది దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన విజయం అంతా ఇంతా కాదు. భారత్ లోనే కాదు.. ప్రపంచ వేదికలపై ఆ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనంతో రికార్డులు బద్దలవుతున్నాయి. ఇటీవలే ట్రిపుల్ ఆర్ లోని ‘నాటు నాటు’పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరాడు. ఈ సందర్భంగా పలువురు భారత క్రికెటర్లు ఈ కొమురం భీముడిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడేందుకు గాను భాగ్యనగరానికి వచ్చిన టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు ఎన్టీఆర్ ను కలిశారు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ తో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా ఎన్టీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
ఎన్టీఆర్, టీమిండియా స్టార్లు ఎక్కడ కలిశారన్నది క్లారిటీ లేదు. బ్యాక్ గ్రౌండ్ లో కూడా చుట్టూ లైటింగ్, కార్లు ఉన్నాయి. బహుశా ఇది ఒక కార్ల షో రూమ్ లా ఉంది. ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా స్టార్లు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చూసిన తారక్, టీమిండియా ఫ్యాన్స్ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు చరణ్ తో కలిసి తారక్ స్టెప్పులు ఇరగదీశాడని, రేపు కివీస్ తో వన్డేలో ఆ జట్టుతో మన క్రికెటర్లు నాటు ఆట ఆడాలని కోరుతున్నారు.
ఇక ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. రేపు (బుధవారం) మధ్యాహ్నాం 1.30 గంటల నుంచి ఉప్పల్ లో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.