Ranji Trophy 2022: దేశంలో మొదలైన కరోనా థర్డ్ వేవ్ కలవరం ఇప్పుడు రంజీకి తగిలింది. ముంబై, బెంగాల్ కు చెందిన పలువురు క్రికెటర్లు కొవిడ్ పాజిటివ్ గా తేలారు. ఇందులో ఒకరు టీమిండియా ఆల్ రౌండర్ కావడం గమనార్హం.
అతి త్వరలో మొదలుకానున్న రంజీ సీజన్ కు ముందు ఆయా జట్లను కరోనా కలవరరపెడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా కఠిన ఆంక్షల నడుమ ఉంటున్న క్రికెటర్లు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ముంబై జట్టుకు చెందిన ఇద్దరు, బెంగాల్ కు చెందిన ఏడుగురు కరోనా బారిన పడ్డారన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది దీని బారిన పడే అవకాశముంది. దీంతో ఈ సీజన్ సజావుగా సాగుతుందా..? లేదా..? అనేది అనుమానంగా మారింది.
జనవరి 13 నుంచి రంజీ సీజన్-2022 మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే కొవిడ్ బారిన పడ్డాడు. అతడితో పాటు ఆ జట్టు వీడియో అనలిస్టుకూ కరోనా సోకింది. దూబేకి రిప్లేస్మెంట్ గా సాయిరాజ్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారు. దూబే.. భారత జట్టు తరఫున ఒక వన్డే, 13 టీ20 లు ఆడాడు. కాగా ఇప్పటికే కోల్కతాకు చేరుకున్న ముంబై జట్టు తమ తొలి మ్యాచ్లో మహారాష్ట్ర తో తలపడనుంది.
ఇక బెంగాల్ టీమ్ లో ఆరుగురు క్రికెటర్లతో పాటు ఓ శిక్షణా సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో సురాజిత్ యాదవ్, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, గీత్ పూరి, ప్రదీప్త ప్రామాణిక్, కజి జునౌద్ లతో పాటు కోచింగ్ స్టాఫ్ సౌరాసిష్ లాహిరి కూడా ఉన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో వీరికి పాజిటివ్ గా తేలడంతో వీళ్లందరినీ ప్రత్యేక గదుల్లో ఐసోలేషన్ లో పెట్టారు.
బెంగాల్ జట్టు కూడా రంజీ సీజన్ 2022లో భాగంగా తమ తొలి మ్యాచ్ ను త్రిపురతో ఆడాల్సి ఉంది. ఇదిలాఉండగా.. ముంబయి జట్టుతో పాటు బెంగాల్ రంజీ సభ్యులకు కరోనా సోకడం.. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెరగనుందని చెబుతున్న నేపథ్యంలో వచ్చే సీజన్ పై అనుమానాలు నెలకొన్నాయి. జనవరి మూడో వారం నుంచి మొదలై ఫిబ్రవరి 15 నాటికి దేశంలో కరోనా పీక్స్ కు వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా క్రికెటర్లను ఆందోళనలకు గురి చేస్తున్నది.
