Ashton Agar Receives Death Threats: రెండున్నర దశాబ్దాల తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. 

సుమారు 24 ఏండ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు ఇక్కడ అడుగు పెట్టగానే బెదిరింపులు మొదలయ్యాయి. ఆసీస్ ఆల్ రౌండర్ ఆస్టన్ అగర్ ను చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా పలువురు దుండగులు అతడి భార్యకు మెసేజ్ లు పెట్టారు. మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు గాను ఆసీస్.. పాక్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 4న రావల్పిండి లో ప్రారంభం కాబోయే తొలి టెస్టుకు ముందే అగర్ భార్యకు బెదిరింపులు రావడంతో ఆ జట్టు ఆందోళనకు గురవుతున్నది. 

మార్చి 4 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగబోయే పర్యటన నిమిత్తం ఆసీస్ జట్టు.. నిన్న పాకిస్థాన్ కు చేరుకుంది. సోమవారం నాడు పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నారు. ఆస్ట్రేలియా టెస్టు జట్టుతో పాటు వన్డేలకు ప్రకటించిన జట్టులో కూడా అగర్ సభ్యుడిగా ఉన్నాడు. 

Scroll to load tweet…

అగర్ పాకిస్థాన్ కు బయలుదేరిన నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఆగంతుకుడు అగర్ భార్య మెడెలీన్ ను హెచ్చరిస్తూ మెసేజ్ చేశాడు. ‘నీ భర్త గనుక పాకిస్థాన్ పర్యటనకు వస్తే అతడిని అక్కడే చంపేస్తాం..’ అని ఆ సందేశంలో హెచ్చరించాడు. దీంతో ఆమె ఈ మెసేజ్ ను అగర్ కు పంపడంతో అతడు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కు పంపాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఫేక్ ఇన్స్టా అకౌంట్ నుంచి వచ్చిందని భావిస్తున్న ఆ మెసేజ్.. ఇండియా నుంచే వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అగర్ కు బెదిరింపులు రావడంతో సీఏ రంగంలోకి దిగింది. దీనిమీద విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన విషయం కావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు కూడా సమాచారం అందించింది. దీంతో రెండు బోర్డులు కలిసి సంయుక్తంగా ఈ అంశంపై విచారణ చేపట్టనున్నాయి.

Scroll to load tweet…

పాకిస్థాన్ తో ఆస్ట్రేలియా జట్టు పర్యటన షెడ్యూల్ : 

మార్చి 4-8 : తొలి టెస్టు.. రావల్పిండి 
మార్చి 12-16 : రెండో టెస్టు.. కరాచీ 
మార్చి 21-25 : మూడో టెస్టు.. లాహోర్ 
మార్చి 29 : తొలి వన్డే : రావల్పిండి
మార్చి 31 : రెండో వన్డే : రావల్పిండి
ఏప్రిల్ 2: మూడో వన్డే : రావల్పిండి
ఏప్రిల్ 5 : ఏకైక టీ20 : రావల్పిండి

గతేడాది 18 ఏండ్ల తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కూడా భద్రతా కారణాలను చూపి ఆఖరి నిమిషంలో సిరీస్ ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. రావల్పిండిలో తొలి వన్డే ప్రారంభానికి సరిగ్గా రెండు గంటల ముందు ఆ జట్టు.. బ్యాగులు సర్దుకుని న్యూజిలాండ్ విమానమెక్కింది. కివీస్ తర్వాత పాక్ పర్యటనకు రావల్సిన ఇంగ్లాండ్ కూడా న్యూజిలాండ్ బాటనే అనుసరించింది. ఈ పరిస్థితుల్లో తమకు ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని, సిరీస్ ను వాయిదా వేస్తున్నామని పాక్ కు తెలిపింది.

ఇక 1998 లో పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. 24 ఏండ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది పాక్. ఈ పర్యటనలో భాగంగా ఏమాత్రం తేడా వచ్చినా.. ఇక పాక్ క్రికెట్ కు సమాధే.. ఇప్పటికే 2009లో పాక్ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న ఓ బస్సులో ముష్కరులు దాడికి దిగారు. ఈ ఘటనతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ దాడి నేపథ్యంలో పదేండ్ల పాటు ఆ దేశంలో పర్యటించడానికి ఏ దేశం కూడా సాహసించలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ పాక్ కు విదేశీ జట్లు వస్తున్నాయి. ఈ పర్యటనలో గనుక జరగరానిది జరిగితే ఇక అంతే సంగతులు..